న్యూఢిల్లీ: స్కూటీని ఢీకొట్టి యువతిని ఈడ్చుకెళ్లిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. స్కూటీని ఢీకొట్టిన విషయం కానీ, కారు కింద యువతి చిక్కుకుపోయిన విషయం కానీ గుర్తించలేదని నిందితులు చెప్పినట్టు ఔటర్ ఢిల్లీ డీసీపీ హరీంద్ర కే సింగ్ వెల్లడించారు. కారు అద్దాలు పూర్తిగా మూసి ఉండటం.. పెద్ద సౌండ్తో మ్యూజిక్ సిస్టం ఆన్ చేసి ఉండటంతో తమకు బయటి శబ్దాలు వినిపించలేదని తెలిపారన్నారు. కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత బానెట్ కింద ఏదో తగులుతున్నట్టుగా గుర్తించి చెక్ చేస్తే యువతి డెడ్ బాడీ కనిపించిందని, దానిని తొలగించి పరారయ్యామని చెప్పారన్నారు. నిందితుల బ్లడ్ శాంపిల్స్ ను పోలీసులు సేకరించారు. వారు లిక్కర్ తాగారా? లేదా? అనేది మెడికల్ రిపోర్టులో వెల్లడికానుంది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు పోలీసు కస్టడీ విధించింది.
రేప్ జరగలేదంటున్న పోలీసులు
యువతి ఒంటిపై దుస్తులు లేకపోవడంతో ఆమెపై అత్యాచారం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం కిలోమీటర్ల దూరం డెడ్ బాడీని ఈడ్చుకు వెళ్లడంతో ఆమె ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయని, దుస్తులు మొత్తం చిరిగిపోయాయని అంటున్నారు. పోస్ట్ మార్టంలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని తెలిపారు. వెహికల్స్ కూడా ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్కు పంపించినట్టు చెప్పారు. కాగా, ఈ ఘటనపై ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనం ఆందోళనలు చేపట్టారు.
సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన: ఎల్జీ సక్సేనా
యువతిని కారుతో గుద్ది కిలోమీటర్ల దూరం ఈడ్చుకుపోయిన ఘటన తనను షాక్కు గురిచేసిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా అన్నారు. ఇది చాలా దారుణం అని, సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని అన్నారు. ఈ కేసును తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, అన్ని వైపుల నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు, ఇది అత్యంత దారుణమైన ఘటన అని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్జీని కోరారు.