- మరో పదిమందికి తీవ్ర గాయాలు
- లాస్ఏంజెల్స్ లోని క్లబ్కు వేలాదిగా వచ్చిన చైనా సంతతి ప్రజలు
- కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయిన దుండగుడు
లాస్ ఏంజిలెస్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లాస్ ఏంజిలెస్ పరిధిలో ఆసియావాసులు ఎక్కువగా ఉండే మాంటెరీ పార్క్ ఏరియాలో ఒక సాయుధుడు ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపాడు. ఈ ఫైరింగ్లో 10 మంది చనిపోగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. అమెరికా టైం ప్రకారం శనివారం రాత్రి 10.30 గంటలకు డ్యాన్స్ క్లబ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. చైనీస్ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ఈ క్లబ్కు వేలాదిగా ప్రజలు వచ్చారు. పార్టీ ముగించుకొని వారంతా వెళ్లిపోయిన గంట తర్వాత.. మెషీన్ గన్ చేతపట్టిన ఓ వ్యక్తి క్లబ్కు వచ్చి అక్కడున్న వాళ్లపై ఫైరింగ్ చేశాడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వివరాలను లాస్ ఏంజిలెస్ కౌంటీ పోలీసుశాఖ కూడా ధ్రువీకరించింది. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించింది. ఇక డ్యాన్స్ క్లబ్ దగ్గర్లో రెస్టారెంట్ను నిర్వహించే సీయుంగ్ వాన్ చాయ్.. కాల్పులకు ముందు జరిగిన సంఘటనలను పోలీసులకు వివరించాడు. “గన్ పట్టుకున్న వ్యక్తి డ్యాన్స్క్లబ్వైపు వెళ్తుండగా చూసిన ముగ్గురు వ్యక్తులు పరుగులు పెడుతూ వచ్చి నా రెస్టారెంట్లో దాక్కున్నారు. డోర్ లాక్ వేయాలని రిక్వెస్ట్ చేశారు. ఎవరో ఒకతను గన్ లోడ్ చేసుకొని డ్యాన్స్ క్లబ్ వైపు వెళ్తుంటే చూసి వచ్చామని వాళ్లు నాకు చెప్పారు” అని తెలిపాడు.
అల్ హంబ్రాలో కాల్పులు.. అతడి పనేనా ?
ఇక మాంటెరీ పార్క్ ఏరియాలో కాల్పులు జరిగిన కాసేపటికే.. దగ్గరే ఉండే అల్ హంబ్రా ప్రాంతంలోనూ ఒక కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు గుర్తించారు. అల్ హంబ్రా ఏరియాలోని లాయ్ లాయ్ బాల్రూం, ఒక డ్యాన్స్ క్లబ్లలో ఈ కాల్పులు జరిగాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మాంటెరీ పార్క్ వద్ద కాల్పులు జరిపిన వ్యక్తే.. ఇక్కడ కూడా కాల్పులు జరిపి ఉంటాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అల్ హంబ్రా ఏరియాలో కాల్పులు జరిపిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని, అతడి గన్ను స్వాధీనం చేసుకున్నారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. అధికారిక ప్రకటన వస్తేనే.. దీనిపై స్పష్టత వస్తుంది. అయితే అల్ హంబ్రా ఏరియా కాల్పుల ఘటనలో ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా, అమెరికాలో కాల్పుల ఘటనల్లో కిందటేడాది 44 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
దొంగల ముఠా కాల్పులతో భారత సంతతి వ్యక్తి మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో దొంగల ముఠా జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన పాత్రో సిబోరాం(66) అనే వ్యక్తి చనిపోయాడు. ఎగ్జాన్ గ్యాస్ స్టేషన్లోని మినీ మార్ట్లో ఈ ఘటన చోటుచేసుకుం ది. చోరీకి చేసేందుకు వచ్చిన ముగ్గురు దొంగలు.. తుపాకులు చూపించి బెదిరిస్తూ నేరుగా స్టోర్లోని క్యాష్ కౌంటర్లోకి చొరబడ్డారు. అందులో క్లర్క్ గా పనిచేసే పాత్రో సిబోరాంపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం స్టోర్ లో ఉన్న క్యాష్ రిజిస్టర్ ను తీసుకొని పారిపోయారు. పాత్రో సిబోరాంకు భార్య, కుమారుడు ఉన్నారు. గన్ కల్చర్ వల్ల ఫిలడెల్ఫియాలో నేరాలు పెరుగుతున్నాయని పాత్రో సిబోరాం చాలాసార్లు తమతో చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశాడని అతడి సహోద్యోగులు మీడియాకు చెప్పారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.