- సిరీస్లో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన పరిస్థితి
- ఉ. 7 నుంచి డీడీ స్పోర్ట్స్, ప్రైమ్ వీడియోలో లైవ్
హామిల్టన్: తొలి వన్డేలో మంచి స్కోరును కాపాడుకోలేకపోయిన టీమిండియా బ్యాటింగ్లో మరింత దూకుడు చూపెట్టడంతో పాటు బౌలింగ్లోనూ మెరుగై ఆదివారం జరిగే రెండో వన్డేలో న్యూజిలాండ్పై గెలిచి సిరీస్లో నిలవాలని చూస్తోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగే ఈ పోరులో ముఖ్యంగా పవర్ప్లేలో ఓపెనర్లు శిఖర్ ధవన్, శుభ్మన్ గిల్ అప్రోచ్ మార్చుకోవాల్సి ఉంటుంది. తొలి పోరులో ఈ ఇద్దరూ 123 రన్స్ జోడించినప్పటికీ చిన్న గ్రౌండ్ అయిన ఈడెన్ పార్క్లో 307 టార్గెట్ కివీస్కు చిన్నదైపోయింది. మరో 30–40 రన్స్ చేసి ఉంటే ఇండియాకు అవకాశాలు మెరుగయ్యేవి. ఓ రకంగా చివర్లో వాషింగ్టన్ సుందర్ మెరుపు బ్యాటింగ్ వల్లే ధవన్సేన ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
ఈ నేపథ్యంలో రెండో వన్డేలో పవర్ప్లేలోనే ఓపెనర్లు వీలైనన్ని ఎక్కువ రన్స్ చేయాల్సి ఉంటుంది. గత పోరులో ఫెయిలైన రిషబ్ పంత్, సూర్యకుమార్ సత్తా చాటితే ఇండియా విజయ అవకాశాలు పెరుగుతాయి. మరోవైపు అనుభవం లేని యువ బౌలర్లు తొలి వన్డేలో తేలిపోయారు. డెబ్యూ పేసర్ ఉమ్రాన్ మాలిక్ నిలకడగా 145 స్పీడ్తో ఆకట్టుకున్నప్పటికీ మరో యంగ్స్టర్ అర్ష్దీప్, సీనియర్ పేసర్ శార్దూల్ ఠాకూర్ నుంచి అతనికి సపోర్ట్ అవసరం. గ్రౌండ్ పెద్దది కాబట్టి చహల్ ప్లేస్లో చైనామన్ కుల్దీప్ యాదవ్ను బరిలోకి దింపితే ఫలితం ఉండొచ్చు. మరోవైపు తొలి మ్యాచ్ జోరును ఇక్కడా కొనసాగించి సిరీస్ను కైవసం చేసుకోవాలని కివీస్ ఆశిస్తోంది.