న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడి హాస్పిటల్లో చేరిన ఇండియా వన్డే జట్టు వైస్-కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, సిడ్నీ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) నుంచి సోమవారమే సాధారణ గదికి మార్చారని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. మంగళవారం మరోసారి స్కానింగ్ నిర్వహించగా బాగా కోలుకుంటున్నట్టు తెలిసిందని వెల్లడించారు.
‘శ్రేయస్ హెల్త్ ఇప్పుడు చాలా మెరుగైంది. ఇలాంటి గాయాల నుంచి కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుంది. కానీ, అయ్యర్ అంతకంటే చాలా వేగంగా కోలుకుని అందరికీ సర్ప్రైజ్ ఇస్తాడు. దీనిపై డాక్టర్ చాలా సంతృప్తిగా ఉన్నారు. అయ్యర్ ఇప్పటికే తన రోజువారి కార్యక్రమాలు చేస్తున్నాడు. తనకు అయిన గాయం తీవ్రమైనదే అయినా కోలుకొని ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీనికి ఎలాంటి సర్జరీ నిర్వహించలేదు. ప్రత్యేక పద్ధతిలో డాక్టర్లు ట్రీట్మెంట్ అందించారు’ అని సైకియా పేర్కొన్నారు.
