అబద్ధాలాడే ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలే

అబద్ధాలాడే ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలే
  • మోదీపై కర్నాటక సీఎం ఫైర్

సాంగ్లి: ప్రధాని నరేంద్ర మోదీపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో అబద్ధాలు మాట్లాడే మోదీ లాంటి ప్రధానిని ఎన్నడూ చూడలేదని ఆయన విమర్శించారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో నిర్వహించిన కన్నడ ర్యాలీలో  సిద్ధరామయ్య పాల్గొని మాట్లాడారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఈ ర్యాలీలో సిద్దరామయ్యను పార్టీ స్థానిక నేతలు సన్మానించారు. అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కర్నాటకలో గత బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు.

‘‘తాము అధికారంలోకి వస్తే దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని 2014లో మోదీ హామీ ఇచ్చారు. 2 కోట్ల ఉద్యోగాలు, అచ్ఛే దిన్ తెస్తామన్నారు. వాటిలో ఒక్కటైనా అమలు చేశారా? నేను, డీకే శివకుమార్ కర్నాటకలో మూలమూలనా పర్యటించి ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు వివరించాం. బీజేపీ అంటేనే అవినీతి, అవినీతి అంటేనే బీజేపీ” అని విమర్శించారు.