మాడ్రిడ్ : ఇండియా డబుల్స్ స్టార్ ప్లేయర్లు సిక్కి రెడ్డి–సుమిత్ రెడ్డి.. మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్లో ఓటమిపాలయ్యారు. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీస్లో సిక్కి–సుమిత్ 17–21, 12–21తో ఆరోసీడ్ రినోవ్ రివ్లాడే–పితా హనింగ్టర్ మెంటరాయ్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశారు. 29 నిమిషాల మ్యాచ్లో సిక్కి ద్వయం తొలి గేమ్ మాత్రమే బాగా ఆడింది.
రివ్లాడే–హనింగ్టర్ కొట్టిన స్మాష్లను తీస్తూ ఒక్కో పాయింట్తో ముందుకెళ్లారు. దీంతో స్కోరు 6–6, 11–11, 14–14, 16–16తో సమమైంది. ఈ దశలో ఇండోనేసియా ప్లేయర్లు స్మాష్లతో వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్ను గెలిచారు.
ఇక రెండో గేమ్ ఆరంభంలో సిక్కి–సుమిత్ మెరుగ్గా ఆడినా చివర్లో తేలిపోయారు. 8–8 స్కోరు వద్ద ప్రత్యర్థులకు వరుసగా 8 పాయింట్లు సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఇండియా జోడీ ఒకటి, రెండు పాయింట్లు గెలిచినా ఇండోనేసియన్లకు అడ్డుకట్ట వేయలేకపోయారు.