పారిస్: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 13–21, 21–10, 21–14తో బీవెన్ జాంగ్ (అమెరికా)పై గెలిచింది. 55 నిమిషాల మ్యాచ్లో సింధు తొలి గేమ్ కోల్పోయినా.. తర్వాతి రెండు గేమ్ల్లో తన ట్రేడ్ మార్క్ షాట్లతో చెలరేగింది. రెండో గేమ్లో 4–4తో స్కోరు సమమైన తర్వాత తెలుగమ్మాయి వరుస పాయింట్లతో హోరెత్తించింది.
మూడో గేమ్లో అదే జోరును కంటిన్యూ చేసింది. 4–4, 5–5 తర్వాత సింధు వరుసగా మూడు, రెండు పాయింట్లను నెగ్గింది. బ్రేక్ తర్వాత నెట్ వద్ద మెరుగైన డ్రాప్స్ వేస్తూ ప్రత్యర్థికి చెక్ పెట్టింది. విమెన్స్ డబుల్స్లో ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్ 21–18, 21–13తో యుకీ ఫుకుషిమా–సయాకా హీరోటా (జపాన్)పై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించారు. మెన్స్ సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ 21–19, 12–21, 20–22తో లు గువాంగ్ జు (చైనా) చేతిలో ఓడి ఇంటిముఖం పట్టాడు.