సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని ఆ సంస్థ సీఎండీ ఎన్. బలరాం నాయక్ అన్నారు. శనివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నస్పూర్​ సింగరేణి డిస్పెన్సరీలో రూ.33 లక్షలతో ఏర్పాటు చేసిన డిజిటల్​ ఎక్స్​రే మిషన్​ యూనిట్​ను సింగరేణి గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, బి.జనక్​ప్రసాద్​తో కలిసి ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి, అభివృద్ధికి వెనుకడబోమన్నారు.

​శ్రీరాంపూర్​ ఏరియాలో కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు నెలాఖరు నాటికి రూ.16 కోట్లతో ర్యాపిడ్​ గ్రావిటీ ఫిల్టర్​ పనులు ప్రారంభిస్తామన్నారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా, ఓబీ వెలికితీతకు కార్మికులు, ఆఫీసర్లు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలో భాగంగా ఆరోగ్య కరదీపిక పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి జీఎం బి.సంజీవరెడ్డి, ఐఆర్ అండ్ పీఎం జీఎం హనుమంతరావు, ఎస్ఓ టు జీఎం​రఘుకుమార్, ఏజీఎంలు పాల్గొన్నారు. 

కాంట్రాక్ట్​ కార్మికుల వేతనాలు పెంచాలని వినతి

సింగరేణి కాంట్రాక్ట్  కార్మికులకు కోలిండియాలో అమలు చేస్తున్న వేతనాలను సింగరేణిలో వర్తింపజేయాలని కోరుతూ సింగరేణి సీఎండీ బలరాం నాయక్​కు సింగరేణి కాలరీస్  కాంట్రాక్ట్  వర్కర్స్  యూనియన్ (ఇప్టూ) లీడర్లు, కార్మికులు వినతిపత్రం అందజేశారు. లీడర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు, సీఎండీలు కాంట్రాక్ట్​ కార్మికులను పట్టించుకోలేదని,  వారి సంక్షేమం, చట్టపరమైన హక్కులను కల్పించడంపై నిర్లక్ష్యం చేశారన్నారు.

వేతనాలు పెంచుతూ లాభాల్లో వాటా కేటాయించాలని కోరారు. 11వ పీఆర్సీలో భాగంగా రాష్ట్ర సర్కారు​ఇతర ఔట్​సోర్సింగ్​ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచినా కాంట్రాక్ట్​ కార్మికులపై వివక్ష చూపిందన్నారు. సీఎండీని కలిసిన వారిలో యూనియన్​ స్టేట్​ ప్రెసిడెంట్​ డి.బ్రహ్మనందం తదితరులు ఉన్నారు.