ఆగస్టులో సింగరేణి ఎన్నికలు

ఆగస్టులో సింగరేణి ఎన్నికలు
  •     కార్మిక సంఘాలతో డీసీఎల్​సీ మీటింగ్​ 

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను ఆగస్టులో  నిర్వహించేందుకు అంగీకారం కుదిరింది. మంగళవారం హైదరాబాద్ లో డిప్యూటీ చీఫ్​ లేబర్​ కమిషనర్ (డీసీఎల్ సీ) శ్రీనివాసులు సమక్షంలో గుర్తింపు సంఘం ఎన్నికలపై కార్మిక సంఘాల ప్రతినిధులు, సింగరేణి మేనేజ్​మెంట్​ చర్చించింది. నాలుగేండ్ల పీరియడ్​తో  గుర్తింపు సంఘం ఎన్నికలు ఉండాలని మేనేజ్ మెంట్  ప్రతిపాదించింది. ప్రతి రెండేండ్లకు ఎన్నికలంటే బొగ్గు ఉత్పత్తిపై  ప్రభావం పడుతున్నదని పేర్కొంది. ఈ ప్రతిపాదనకు మెజారిటీ కార్మిక సంఘాలు ఓకే చెప్పాయి. మరికొన్ని  సంఘాలు రెండేండ్ల పీరియడ్ తో ఎన్నికలు నిర్వహించాలని సూచించాయి. మెజారిటీ సంఘాలు, మేనేజ్​మెంట్​ కలిసి నాలుగేండ్ల పీరియడ్ పై చీఫ్​ లేబర్  కమిషనర్​ పర్మిషన్​ తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈనెల 24 లోపు  సీఎల్​సీ నుంచి అనుమతి వస్తుందని, అదే రోజు మీటింగ్​కు కార్మిక సంఘాల నేతలు సమ్మతి తెలిపారు. అదే రోజు ఎన్నికల షెడ్యూల్​ రిలీజ్​ చేసి ఆగస్టులో ఎన్నికలు నిర్వహిస్తామని సింగరేణి డైరెక్టర్​(పా) అంగీకరించినట్లు కార్మిక సంఘాల లీడర్లు పేర్కొన్నారు.