
- కేంద్ర ప్రభుత్వం తీరుపై నిరసనలు కొనసాగిస్తాం
కోల్బెల్ట్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జూలై 9కి వాయిదా వేసినట్లు సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. శుక్రవారం మందమర్రిలోని ఏఐటీయూసీ ఆఫీస్ లో, కాసీపేట–1 బొగ్గు గనిపై వేర్వేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో వారు మాట్లాడారు. మహల్గాం ఉగ్రదాడి, దాయాది దేశంతో ఉద్రిక్తతల నేపథ్యంలో సమ్మె చేయడం సరికాదని కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మిక చట్టాలను, హక్కులను కాలరాస్తూ కార్పొరేట్కంపెనీలకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. సమ్మె వాయిదా పడినప్పటికీ కేంద్ర ప్రభుత్వ తీరుపై బొగ్గు గనులు, కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ ఆఫీస్ల ఎదుట నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. నాయకులు సలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్, దేవి భూమయ్య, కాంపెల్లి సమ్మయ్య, ఓ.రాజశేఖర్, పానుగంటి వెంకటస్వామి, సుదర్శన్రెడ్డి, పెద్దపల్లి బాణయ్య, శర్మ, మీనుగు లక్ష్మీనారాయణ, బి.రాజేందర్తదితరులున్నారు.