హైదరాబాద్: మాదాపూర్లో శుక్రవారం రాత్రి హీరో సాయి తేజ్ బైకు మీద నుంచి పడి గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆయన అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై నేపథ్య గాయకుడు ఆర్పీ పట్నాయక్ స్పందించారు. ప్రమాదం జరిగిన స్థలంలో ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్స్ట్రక్షన్ కంపెనీ మీద మరియు ఆ ప్రాంత మున్సిపాలిటీ మీద కేసు పెట్టాలని అన్నారు. అలా చేస్తే అయినా మిగతా ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా.. ఆర్పీ పోస్టు మీద సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ ప్రాంతం నుంచి ప్రతిరోజూ తాము ప్రయాణం చేస్తామని.. మేం కిందపడనప్పుడు సాయి తేజ్ మాత్రం ఎందుకు పడ్డాడని ప్రశ్నిస్తున్నారు. హైవే మీదనే 80 కి.మీ. స్పీడ్ లిమిట్ ఉంటుంది కదా.. అటువంటిది హైదరాబాద్ రోడ్ల మీద 120 కి.మీ. స్పీడ్ వెళ్లొచ్చా అని అడుగుతున్నారు.
‘సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు, అదేసమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకు పోవటానికి కారణమైన అక్కడ ఉన్న construction కంపెనీపై మరియు ఎప్పటికప్పుడు రోడ్డుని క్లీన్ గా ఉంచాల్సిన మున్సిపాలిటీ పై కూడా కేసు పెట్టాలి. ఈ కేసు వల్ల నగరంలో మిగతా ఏరియాల్లో ఇలాంటి అజాగ్రత్తలు పాటించేవాళ్లు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారు అని నా అభిప్రాయం’ అని ఆర్పీ పట్నాయక్ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు పెట్టారు.