
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ బృందం కీలక విషయాలను రాబట్టే పనిలో పడింది. దీంతో ముమ్మరంగా దర్యాప్తును కొనసాగిస్తుంది. తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయిన రమేష్, సురేష్, షమీమ్ ఇళ్లల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎల్బీనగర్ లో నివాసం ఉంటున్న షమీమ్ ను సిట్ అధికారులు ఇంటి నుంచే అరెస్ట్ చేశారు.
పేపర్ లీకేజ్ ద్వారానే ఈ ముగ్గురు ఎగ్జామ్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఆరెస్టైన రమేష్, షమీమ్, సురేష్ లు సైతం గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి 100కి పైగా మార్కులు పొందినట్లు విచారణలో గుర్తించారు సిట్ అధికారులు. పేపర్ లీకేజ్ ద్వారానే ఈ ముగ్గురు ఎగ్జామ్ రాశారని పోలీసులు చెబుతున్నారు. టీఎస్పీఎస్సీ లో పనిచేసే 26 మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయగా.. వారిలో 8 మంది క్వాలిఫై అయ్యారని గుర్తించారు. TSPSCలో పని చేస్తున్న 30 మందికి ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమానితులందరినీ విచారించి.. వారి పాత్రపైనా ఆరా తీయనున్నారు.
12 మంది నిందితులకు రిమాండ్
టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో 12 మంది నిందితులకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే లీకేజీ కేసులో ఆరెస్ట్ అయిన 9 మందిని పోలీసులు కస్డిడికి తీసుకుని విచారించారు. మరోవైపు టీఎస్పీఎస్సీ లో పనిచేస్తున్న రమేష్, సురేష్, షమీమ్ లను ఇవాళ పోలీసులు ఆరెస్ట్ చేశారు. వారిని కూడా కోర్టు ముందు హాజురు పరచడంతో 9 మందికి మార్చి 28 వరకు, కొత్తగా ఆరెస్టైన ముగ్గురికి ఏప్రిల్ 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది.