Vijay Deverakonda: 'కింగ్‌డమ్'పై వివాదం.. తమిళుల ఆందోళనపై నిర్మాణ సంస్థ వివరణ

Vijay Deverakonda: 'కింగ్‌డమ్'పై వివాదం..  తమిళుల ఆందోళనపై నిర్మాణ సంస్థ వివరణ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda )   హీరోగా భాగ్యశ్రీ బోర్సే ( Bhagyashree Borse ) హీరోయిన్‌గా నటించిన 'కింగ్ డమ్' ( Kingdom  ) మూవీ  బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.  గౌతమ్ తిన్ననూరి ( Gautam Tinnanuri ) దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ  మాస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా జూలై 31న థియేటరల్లో విడులైంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్రం పాజిటివ్ టాక్ తో వంద కోట్ల మార్క్ కు చేరువులో ఉంది.  అయితే ఈ సినిమా విజయవంతంగా దూసుకుపోతున్న ఈ తరుణంలో, 'కింగ్‌డమ్' సినిమా చుట్టూ ఒక అనూహ్య వివాదం చెలరేగింది.

తమిళ అనుకూల పార్టీ అయిన నామ్ తమిజర్ కట్చి (NTK) కార్యకర్తలు ఈ చిత్రంలో శ్రీలంక తమిళులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలతో తమిళనాడులోని మధురై, తిరుచ్చిలోని పలు థియేటర్ల వద్ద ఆందోళనలు, నిరసనలకు దిగారు. ఆందోళనకారులు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 'కింగ్‌డమ్' సినిమా శ్రీలంకలో జరిగిన అంతర్యుద్ధ నేపథ్యాన్ని, అక్కడి ప్రజల కష్టాలను తప్పుగా చిత్రీకరించిందని వారు తీవ్రంగా ఆరోపించారు.

 

ఈ వివాదంపై నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా స్పందించింది.  తమిళ ప్రజల మనోభావాలను మేము మనస్ఫూర్తిగా గౌరవిస్తాము. మా సినిమాలో పక్క రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఎలాంటి సన్నివేశాలు లేవని హామీ ఇస్తున్నాం. ఈ సినిమా కథ పూర్తిగా కల్పితం. ఇది ఎవరి నిజ జీవిత సంఘటనలకూ సంబంధించినది కాదు. ఈ విషయాన్ని సినిమా ప్రారంభంలోనే డిస్‌క్లెయిమర్‌లో స్పష్టంగా పేర్కొన్నాం అని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.

 ఈ సినిమా వల్ల ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే తాము చింతిస్తున్నామని మూవీ మేకర్స్ తెలిపింది. ఈ కష్ట సమయంలో సినిమాకు మద్దతు ఇవ్వాలని ప్రేక్షకులను కోరింది. ఈ సినిమాలో శ్రీలంక తమిళులను కించపరిచేలా ఒక్క సన్నివేశం కూడా లేదని వివరణ ఇచ్చింది. తమపై వస్తున్న కథనాలన్నీ నిరాధారమైనవని, ఈ కథ పూర్తిగా కల్పితమని స్పష్టం చేసింది.

 

మరోవైపు, తమిళనాడులోని సినిమా పంపిణీదారులు థియేటర్లకు పోలీసు రక్షణ కల్పించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం 'కింగ్‌డమ్' సినిమా వసూళ్లపై ప్రభావం చూపుతుందో లేదో వేచి చూడాలి. అయితే, ఒక సినిమా కథను దానిలోని డిస్‌క్లెయిమర్‌తో కాకుండా రాజకీయ కోణంలో చూడడం సరికాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, సినిమా విజయం చుట్టూ నెలకొన్న ఈ వివాదం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.