- హాస్పిటల్ ఎదుట కుటుంబీకుల ఆందోళన
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని గీతికా చిల్డ్రన్స్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆరేళ్ల బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఖమ్మం రూరల్ మండలం జాన్బాద్ తండాకు చెందిన జర్పుల వీరన్న– దేవి దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో చిన్న కుమారుడికి వరిబీజం శస్త్రచికిత్స చేయించేందుకు బుధవారం ఉదయం హాస్పిటల్లో చేర్పించారు. బాలుడికి శస్త్రచికిత్స అనంతరం వెంటిలేటర్ అవసరమని చెప్పి నెహ్రూనగర్లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అయితే సాయంత్రానికి బాలుడు మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు తెలిసింది. శస్త్రచికిత్స విఫలమవడంతోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని వారు ఆరోపించారు.దీంతో బుధవారం రాత్రి ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గురువారం కూడా నిరసన కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యం కుటుంబ పెద్దలతో మాట్లాడి నష్టపరిహారంచెల్లించినట్టు సమాచారం.
