అమర జవాను ఫ్యామిలీకి ఇల్లు కట్టించిన యువత

అమర జవాను ఫ్యామిలీకి ఇల్లు కట్టించిన యువత

ప్రభుత్వం చేయలేని పని యూత్ చేసి నిరూపించారు. ఓ అమర జవాను కుటుంబానికి సాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం  అమర జవాను కుటుంబానికి కొత్త ఇంటిని కానుకగా ఇచ్చారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

ఇండోర్‌ సమీపంలో ఉన్న బెట్మా గ్రామానికి చెందిన మోహన్ సింగ్ BSF జవానుగా విధి నిర్వహిస్తూ 1992లో అమరుడయ్యాడు. అప్పటికే ఆయనది పేద కుటుంబం. గుడిసెలో నివసించేవారు. మోహన్ మృతిచెందేనాటికి ఆయనకు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ఆయన భార్య గర్భిణి. దీంతో కుటుంబ భారం ఆయన భార్యపై పడింది. ఆమె అదే గుడిసెలో తన పిల్లలతో జీవిస్తూ కాలం వెళ్లదీస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గుడిసె పైకప్పు ధ్వంసమైంది. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. మోహన్ కుటుంబ పరిస్థితిని చూసిన గ్రామ యువత మానవత్వంతో ముందుకు వచ్చింది.

వాట్సాప్ గ్రూపులో ఓ మెసేజ్ ఇచ్చింది. అందరు తనవంతుగా సాయం చేద్దాం అని వాట్సాప్ లో పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆ డబ్బులతో ఆ కుటుంబానికి ఓ ఇల్లు కట్టించి ఇండిపెండెంట్ కానుకగా ఇచ్చింది. ఇందుకోసం గ్రామ యువత ఒక చెక్కు-ఒక సంతకం అనే కార్యక్రమానికి చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా రూ.11 లక్షలు సేకరించి.. రూ.10 లక్షలతో మోహన్ కుటుంబానికి కొత్త ఇల్లు కట్టించి ఇచ్చారు. జవాను భార్యను తమ చేతులమీదుగా కొత్త ఇంట్లోకి నడిపించి చేయూతనిచ్చామని తెలిపారు. మిగిలిన డబ్బులతో మోహన్ విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్టించాలని నిర్ణయించినట్లు తెలిపింది యూత్.  ఈ సందర్భంగా యువత అందరికీ అమర జవాను భార్య రాఖీలు కట్టి ధన్యవాదాలు తెలిపారు.