ధంతేరస్ వచ్చిందంటే.. ఊరువాడలన్నీ దీపాలతో నిండిపోతాయి. చిచ్చు బుడ్డుల మెరుపులు, టపాసుల మోతలు మొదలవుతాయి. అందుకే ఈ పండుగని ‘చోటీ దివాళీ’ అని కూడా అంటారు. ఈ రోజు ఆడవాళ్లంతా బంగారం, వెండి షాపులకి ‘క్యూ’ కడతారు. కనీసం అర కాసు బంగారమైన కొనాలను కుంటారు. ఇంటింటా లక్ష్మీ దేవి కొలువు తీరే ధంతేరస్ పండుగ ఈరోజే. మన రాష్ట్రంలో తక్కువగానీ, నార్త్ ఇండియాలో బాగా జరుపుకుంటారు.
దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే త్రయోదశి తిధి రోజున ధంతేరస్ జరుపుకుంటారు. ఈ పండుగనే ‘ధన త్రయోదశి’ అని కూడా పిలుస్తారు. సిరి, సంపదలిచ్చే శ్రీ మహాలక్ష్మికి ఈరోజు ఘనంగా పూజలు చేస్తారు. ఈ రోజు వెండి, బంగారం కొంటే అష్టైశ్వర్యాలు వెంటే వస్తాయని నమ్ముతారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ పండుగ అసలు ఎలా వచ్చిందంటే..
ఇలా వచ్చింది
అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని చిలుకుతున్నారు. అప్పుడు సరిగ్గా ఆశ్వయుజ త్రయోదశి రోజునే ఆ పాలకడలి నుంచి లక్ష్మీ దేవి పుట్టింది. లక్ష్మీ దేవితో పాటు కల్పవృక్షం, కామధేనువు.. విష్ణుమూర్తి అవతారమైన దేవవైద్యుడు ధన్వంతరి కూడా అవతరించాడు. దాంతో అప్పట్నించీ ఆరోగ్యాన్నిచ్చే ధన్వంతరి పుట్టిన రోజునే ధంతేరస్గా జరుపుకుంటున్నారు. ధనానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి పుట్టింది కూడా ఈరోజే అవడంతో ఈ పండుగనే ధన త్రయోదశి అని కూడా పిలుస్తున్నారు. ధన త్రయోదశికి సంబంధించిన మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే...హిమ అనే రాజుకి ఒక కొడుకు ఉండేవాడు. ఆ రాకుమారుడికి పెళ్లైన నాలుగో రోజున పాముకాటుతో మరణగండం ఉంటుంది. ఆ విషయం తెలిసిన అతని భార్య అతడ్ని ఎలాగైనా కాపాడుకోవాలి అనుకుంటుంది. ఆ రోజు భర్త నిద్రపోకుండా ఆభరణాలు, బంగారు, వెండి నాణాలని గుమ్మం దగ్గర కుప్పగా పోసింది. కథలు చెబుతూ, భజనలు పాడుతూ కూర్చోబెట్టింది. దాంతో పాము రూపంలో వచ్చిన యముడుకి ఆ బంగారం వెలుగుల మధ్య ఏమీ కనిపించలేదు. గది లోపలకు వెళ్ళ లేక ఆ రాశి మీదే కూర్చొని, ఆ కథలు, పాటలు వింటూ ఉండిపోయాడు. రాత్రి గడిచిపోయింది. తెల్లారాక పాము వెళ్ళిపోయింది. ఆ పెళ్ళికూతురి తెలివితేటలకి గుర్తుగా అప్పటి నుంచి ఆ రోజును ‘ధంతేరస్’గా జరుపుకుంటున్నారట.
బంగారం, వెండి..
ధంతేరాస్ రోజున ఆడవాళ్లంతా పొద్దున్నే లేచి ఇల్లు, వాకిలిని శుభ్రం చేస్తారు. సిరి సంపద కోసం ఈరోజు సాయంత్రం లక్ష్మీ దేవికి, ఆయురారోగ్యాల కోసం ధన్వంతరికి పూజలు చేస్తారు. యమ దర్మరాజు దయ కోసం సాయంత్రం పూట దీపాలు కూడా వెలిగిస్తారు. ఈరోజు ధనానికి అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు. అలాగే ధంతేరస్ రోజున ప్రతి ఒక్కరు వాళ్ల వాళ్ల స్థోమతని బట్టి బంగారం, వెండి లేదా కొత్త పాత్రలు కొని పూజలో పెడతారు.