మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బృందావన్కాలనీలో ఈ నెల18వ తేదీన జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసు మిస్టరీ వీడింది. భార్య, అత్తను చంపింది అల్లుడే అని తేలింది. సుపారీ కిల్లర్స్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. రామగుండం సీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్లోని శక్కర్నగర్కు చెందిన కాలేరు అరుణ్కుమార్కు మంచిర్యాలలోని బృందావన్కాలనీకి చెందిన రవీనా ఆన్లైన్ పబ్జీ గేమ్ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ తల్లిదండ్రులను ఒప్పించి గతేడాది నవంబర్6న పెళ్లి చేసుకున్నారు. బోధన్లో కాపురం పెట్టారు. రవీనా గర్భవతి అయ్యాక అరుణ్కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చి, మంచిర్యాల విమెన్ పీఎస్లో భర్తపై కంప్లైంట్ చేసింది. కౌన్సెలింగ్ఇచ్చినా అరుణ్లో మార్పు రాలేదని అతనితో వెళ్లేందుకు రవీనా నిరాకరించింది. అసలు తాను గర్భం దాల్చలేదని భర్తతో చెప్పింది. దీంతో అత్త విజయలక్ష్మినే అబార్షన్ చేయించి ఉంటుందని ఆమెను చంపుతానని అరుణ్ బెదిరించాడు.
యూట్యూబ్లో సుపారి కిల్లర్
యూ ట్యూబ్లో గన్ కల్చర్ ప్రోగ్రాం చూస్తుండగా కామెంట్ బాక్స్లో కనిపించిన ‘సుపారి కిల్లర్విజయవాడ’ అనే ఐడీ ఆధారంగా గుంటూరుకు చెందిన బిట్టుకు ఫోన్ చేసి తన భార్య, అత్తలను చంపాలని చెప్పాడు. బిట్టు రూ.10 లక్షలు అడగగా తన అత్తగారింట్లో ఎప్పుడూ 20 తులాల బంగారం, రూ.4 లక్షలు ఉంటాయని చంపాక అవి నువ్వే తీసుకోవచ్చని అరుణ్ చెప్పాడు. బిట్టు ఆన్లైన్లో పరిచయమైన తెనాలికి చెందిన సుబ్బు అనే వ్యక్తితో కలిసి 17న మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఉన్న ఓ లాడ్జిలో దిగాడు. అరుణ్, బిట్టు, సుబ్బు బైక్పై18న తెల్లవారుజామున 3 గంటలకు బృందావన్కాలనీకి చేరుకున్నారు. 5 గంటలకు నల్లా నీళ్ల కోసం ఇంటి బయటికి వచ్చిన విజయలక్ష్మి మెడకు తాడు బిగించి చంపారు. తర్వాత ఇంట్లోకి వెళ్లి రవీనాను అంతమొందించారు. బీరువాలో ఏమీ దొరక్కపోవడంతో అరుణ్కుమార్ ల్యాప్టాప్ తీసుకొని బైక్పై ముగ్గురూ హైదరాబాద్ వెళ్లారు. సుపారి డబ్బులు ఈ నెల 28లోగా ఇవ్వాలని చెప్పి బిట్టు, సుబ్బు వెళ్లిపోగా, అరుణ్ హైదరాబాద్లోని తన బావ ఇంట్లో ఉండి, అక్కడి నుంచి బోధన్కు వచ్చాడు. పోలీసులు తన కోసం గాలిస్తున్న విషయం తెలుసుకొని అరుణ్ఇంటి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత మొదట అరుణ్ను, అతడు చెప్పిన వివరాల ఆధారంగా మిగతా ఇద్దరిని అరెస్టు చేసినట్టు సీపీ వివరించారు.