
భైంసా, వెలుగు : నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మ రుణం తీర్చుకునేందుకు ఓ కొడుకు ఆమెతో కలిసి తీర్థయాత్ర చేపట్టాడు. ఎప్పుడు ఇంటి వద్ద ఉంటూ.. బయటి ప్రపంచమే తెలి యని ఆ తల్లిని పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తూ రుణం తీర్చుకుంటున్నాడు. తండ్రి ఇచ్చిన స్కూటర్పై తల్లితో కలిసి పర్యటిస్తున్నాడు. ఇప్పటికే 65,412 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసుకొని బుధవారం నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వచ్చాడు. 44 ఏండ్ల కృష్ణ కుమార్ స్వస్థలం కర్నాటకలోని మైసూర్. ఇతడి తండ్రి దక్షిణమూర్తి ఆరేండ్ల క్రితం చనిపోయాడు. తల్లి చూడరత్నమ్మకు ఇప్పుడు 73 ఏండ్లు. కృష్ణ కుమార్ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా పని చేసేవాడు. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఆయన జ్ఞాపకాలతో బాధపడకూడదనుకుని ప్రముఖ ఆలయాలను చూపించాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి తండ్రి స్కూటర్పై తీర్థయాత్రకు కదిలాడు. మాతృసేవ సంకల్ప యాత్ర పేరుతో 2018 జనవరి 15న మైసూర్ నుంచి మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరుపతి, కశ్మీర్లోని పలు క్షేత్రాలతో పాటు నేపాల్, మయన్మార్, భూటాన్లోని ఆలయాలను కూడా దర్శించుకున్నారు. తల్లిదండ్రులు దూరమైన తర్వాత వారి ఫొటోలకు పూలదండ వేసి మొక్కడం కంటే వారు ఉన్నప్పుడే సేవ చేసి తృప్తి పొందాలని కృష్ణకుమార్అభిప్రాయపడ్డాడు. నాన్న ఇచ్చిన స్కూటర్తో ప్రయాణిస్తుంటే నాన్న కూడా తమ వెంట ఉన్నారనే అనిపిస్తుందన్నారు. అయితే కృష్ణ కుమార్ మాత్రం అవివాహితుడు.