
కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సోనియా వెంట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఆస్తి వివరాలకు సంబంధించి ఓ అఫిడవిట్ను సమర్పించారు.
అఫిడవిట్ ప్రకారం సోనియా దగ్గర ప్రస్తుతం రూ.60 వేల నగదు ఉంది. మొత్తం రూ.16.59 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. మొత్తం రూ.2,44,96,405ని షేర్ల రూపంలో పెట్టుబడులుగా పెట్టారు. వీటిలో రిలయన్స్ హైబ్రిడ్ బాండ్ జి, రూ.28,533 విలువైన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ఉన్నాయి. రూ.72,25,414 విలువైన పోస్టల్ సేవింగ్స్, బీమా పాలసీలు, నేషనల్ సేవింగ్స్ స్కీమ్ (NSS) రూపంలో పెట్టుబడులు ఉన్నట్టు తెలిపారు.
అలాగే… న్యూఢిల్లీలోని డేరామండీ గ్రామంలో రూ.7,29,61,793 విలువైన వ్యవసాయ భూమి తన పేరుతో ఉందని సోనియా అఫిడవిట్ లో తెలిపారు. దీంతో పాటు ఇటలీలో వారసత్వంగా వచ్చే ఆస్తిలో రూ.7,52,81,903 వాటా ఉన్నట్లు చూపించారు. తన కుమారుడు రాహుల్ గాంధీ నుంచి అప్పుగా రూ.5 లక్షలను తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు 88 కిలోల వెండితో సహా రూ.59,97,211 విలువైన బంగారు నగలు ఉన్నట్టు అఫిడవిట్లో తెలిపారు సోనియా గాంధీ.