
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యాక్సినేషన్ పాలసీని తప్పుబట్టారు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ. 18 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలన్నారు. దీనిపై ప్రధాని మోడీకి లేఖ రాశారు సోనియా. కరోనా నియంత్రణపై గతేడాది పాఠాలు నేర్చుకున్నా...ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఒకే టీకాకు వేర్వేరు ధరలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు సోనియా. కేంద్రం ప్రభుత్వానికి 150 రూపాయలకే వ్యాక్సిన్ ఇస్తున్న సీరమ్..రాష్ట్రాలకు 400, ప్రైవేట్ హాస్పిటల్స్ కు 600 రూపాయలకు అమ్మాలని నిర్ణయించింది. దీంతో ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి వస్తుందని, రాష్ట్రాల నిధులు కూడా వీటికే ఖర్చయిపోతాయని చెప్పారు సోనియా. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ టీకా ఉచితంగా అందించాలని సోనియా సూచించారు.