న్యూఢిల్లీ : జీ ఎంటర్టైన్మెంట్తో తన ఇండియా యూనిట్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం కల్వర్ మాక్స్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ అని పిలుస్తారు) 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.83 వేల కోట్లు) విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుందని సోనీ గ్రూప్ కార్పొరేషన్ సోమవారం ప్రకటించింది. ఇందుకోసం సోనీ జీ గ్రూపునకు టెర్మినేషన్ నోటీసును పంపింది. ఒప్పందంలోని షరతులను పాటించలేదని, గడువు తేదీలోపు విలీనం ముగియలేదని ఆరోపించింది. విలీన ఒప్పందాన్ని రెండు సంవత్సరాల క్రితం ప్రకటించారు.
ఈ ఒప్పందం నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్రేక్-అప్ ఫీజుగా 90 మిలియన్ల డాలర్లను చెల్లించాలని సోనీ డిమాండ్ చేసింది. ఈ సమస్యపై స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో సోనీ చేసిన అన్ని వాదనలను జీ ఖండించింది చట్టపరమైన పరిష్కారాలను అన్వేషిస్తున్నట్లు తెలిపింది. తాము విలీనం పట్ల అత్యంత నిబద్ధతను ప్రదర్శించామని, విలీనం కోసం రూ.366 కోట్లకుపైగా ఖర్చు చేశామని తెలిపింది. నాయకత్వంపై తలెత్తిన ప్రతిష్టంభన ఒప్పందం రద్దుకు కారణమని చెబుతున్నారు.
మోసం ఆరోపణలపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దర్యాప్తును ఎదుర్కొన్న జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పునిత్ గోయెంకాను, విలీనం తర్వాత కొనసాగించాలనే డిమాండ్ను సోనీ తిరస్కరించింది. ఈ ఒప్పందం ఖరారై ఉంటే 70 కంటే ఎక్కువ భారతీయ టీవీ ఛానెల్స్ విలీన సంస్థకు ఉండేవి. ఇండియాలో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్నెట్వర్క్ ఏర్పడి ఉండేది.
సోనీపై చర్య తీసుకుంటామన్న జీ
డీల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 90 మిలియన్ డాలర్లు చెల్లించాలని సోనీ నుంచి డిమాండ్ నోటీసు వచ్చిందని జీ తెలిపింది. సోనీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై అన్ని రకాల ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. విలీన ఒప్పందా నికి అనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేశామని, చర్యలు తీసుకున్నామని పేర్కొంది. ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర గోయెంకా కంపెనీ నుంచి నిధులను మళ్లిస్తున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ గుర్తించింది.
ఏ లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్ పదవిని నిర్వహించకుండా సెబీ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా విలీనానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. సెబీ ఆర్డర్పై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే విధించినప్పటికీ, జపాన్లో కఠినమైన కార్పొరేట్ గవర్నెన్స్ పాలసీ కారణంగా విలీన సంస్థకు గోయెంకా నాయకత్వం వహించడం సోనీకి నచ్చలేదు.