సైబర్​ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి : రాహుల్ హెగ్డే 

సైబర్​ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి : రాహుల్ హెగ్డే 

సూర్యాపేట, వెలుగు : సైబర్​నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో సైబర్ వారియర్స్​కు మొబైల్ ఫోన్లను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ మోసానికి గురైనవారు వెంటనే 1930 జాతీయ టోల్ ఫ్రీ నంబర్​కు ఫిర్యాదు చేయాలన్నారు.

సైబర్ నేరాల ఫిర్యాదులు, కేసుల స్థితిగతులు తెలుసుకోవడానికి అన్ని పోలీస్​స్టేషన్లలో సైబర్ వారియర్స్ ను నియమించామని తెలిపారు. ఫిర్యాదుదారుడు తన కేసు వివరాలు తెలుసుకోవడానికి సైబర్ వారియర్​కు ఫోన్​ చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి రాజేశ్ మీనా, సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ శ్రీనివాసరావు, సైబర్ సెక్యూరిటీ ఇన్​స్పెక్టర్​లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. 

జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.. 

ఏప్రిల్ 1 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్- అమల్లో ఉంటుందని ఎస్పీ రాహుల్ హెగ్డే సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసుల అనుమతి లేకుండా  జిల్లాలో ఎవరూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులకు ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు.