న్యూఢిల్లీ: స్మోక్ అటాక్ ఘటనపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. భద్రతా లోపాలపైనా విచారణ జరపాలని అధికారులకు స్పష్టం చేశారు. దుండగులను పట్టుకోవడంలో సాయపడిన లోక్సభ సభ్యులను, భద్రతా సిబ్బందిని, ఛాంబర్ సిబ్బందిని, మార్షల్స్ను అభినందించారు. అనంతరం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. దీనిలో సభలోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు.
ఇష్యూకు సంబంధించి ఇద్దరిని హౌస్ లోపల, మరో ఇద్దరిని పార్లమెంటు బయట అరెస్ట్ చేశామని సభకు బిర్లా తెలిపారు. దర్యాప్తులో ఢిల్లీ పోలీసులు కూడా పాల్గొంటారని చెప్పారు. అధికారుల నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. లోక్సభలో దుండగులు స్ప్రే చేసిన పొగ ప్రమాదకరం కాదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్ను ఇటీవల విడుదల చేసిన బెదిరింపు వీడియోపై కూడా చర్చించాలని పలువులు నేతలు పట్టుబట్టగా.. దానిపై ఇప్పుడు చర్చించడం సరికాదని స్పీకర్ బిర్లా పేర్కొన్నారు.