
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వృద్ధులు, దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం బుధవారం ప్రారంభమైన ప్రత్యేక ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పట్టణంలోని అర్బన్ తహసీల్దార్ ఆఫీస్లో జరిగిన ప్రజావాణికి 38 మంది బాధితులు వచ్చి అర్జీలు అందజేశారు. కలెక్టర్ విజయేందిర బోయి దివ్యాంగులు, వయోవృద్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వెంటనే పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ఇక నుంచి ప్రతినెలా మొదటి బుధవారం ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తామని చెప్పారు. సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు స్థానిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ డీఆర్డీవో జోజప్ప, నగరపాలక సంస్థ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి జరీనా బేగం, అర్బన్ తహసీల్దార్ గన్సీరాం, ఎల్డీఎం భాస్కర్ పాల్గొన్నారు.