
- తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన మిర్చి దిగుబడులు
- వాతావరణం బాగా లేక ఇబ్బందులు
- అన్ని రాష్ట్రాల్లో తగ్గిన సరఫరా
న్యూఢిల్లీ: దేశమంతటా కూరగాయలు, ముఖ్యంగా టమాట ధరలు మండిపోతున్నాయి. ఇవి చాలవన్నట్టు మసాలాల రేట్లు చుక్కలనంటుతున్నాయి. ముఖ్యమైన మసాలా దినుసుల రేట్లు గత సంవత్సర కాలంలో డబులైంది. జీలకర్ర రిటైల్ ధరలు గత నెలలో దాదాపు 75 శాతం పెరిగాయి. వాతావరణ పరిస్థితులు బాగాలేకపోవడం, ఉత్పత్తి తగ్గడం ఈ పరిస్థితికి కారణం. వచ్చే క్యాలెండర్ సంవత్సరంలో జీలకర్ర ధరలు మాత్రం కాస్త తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. “జీలకర్ర సంవత్సరానికి ఒకసారి పండుతుంది. ఈ ఏడాది దాదాపు 30–-40 శాతం పంట నష్టం వాటిల్లింది. పసుపు వంటి అనేక పంటలు అకాల వర్షాలు, వడగళ్ల వానల కారణంగా బాగా దెబ్బతిన్నాయి. బిపర్జోయ్ తుఫాను కారణంగా రాజస్థాన్లో ధనియాల పంట తుడిచిపెట్టుకుపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల ఎండు మిర్చి ఉత్పత్తి తగ్గింది”అని సుమయ ఆగ్రో చీఫ్ గ్రోత్ ఆఫీసర్ దీపక్ పరీక్ చెప్పారు. మసాలాల ఇన్ఫ్లేషన్ఈ ఏడాది జనవరి నుంచి తగ్గుముఖం పట్టినా, వార్షికంగా 21 శాతం పెరిగింది. ఇదే ఏడాది జూన్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) గత నెలలో మళ్లీ ఎగిసింది. ఇది సంవత్సరానికి 19.2 శాతం పెరిగి ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. జీలకర్ర ఇన్ఫ్లేషన్ రేటు 74.1 శాతం ఉంది.
జీలకర్ర ధరల పెరుగుదలకు కారణం ఏమిటి?
గుజరాత్లోని మెహసానా జిల్లాలోని ఉంఝా వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ మండీలో జీలకర్ర ధరలు ఈ ఏడాది ప్రారంభం నుంచి క్వింటాల్కు రూ. 50 వేలపైగా పెరిగి జులై 18న క్వింటాల్కు రూ.60 వేల మార్కును దాటాయి. ఇవి జూన్ నెలలో దాదాపు 74.1 శాతం పెరిగాయి. టోకు ఇన్ఫ్లేషన్ రేటు 95.7 శాతం ఉంది. అస్థిర వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి పడిపోవడం ధరలను పెంచుతున్నాయి. అస్థిరమైన డిమాండ్కు తోడు ఉత్పత్తి తగ్గిన ఫలితంగా ధరల పెరుగుదల బాగా ఉంది. జీలకర్ర ఉత్పత్తి 2019–-20 నుంచి క్రమంగా తగ్గుతోంది. అకాల వర్షాల కారణంగా ఈసారి దిగుబడి కొంత తక్కువగా ఉంటుంది.
ధరలు ఎప్పుడు తగ్గుతాయి ?
తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా మసాలాల దిగుబడులు తగ్గి ధరలు పెరిగాయి. వచ్చే క్యాలెండర్ సంవత్సరం తరువాతే ధరల నుంచి ఉపశమనం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. పసుపు, ధనియాలు, జీలకర్రతో సహా దాదాపు అన్ని పంటలు సుదీర్ఘకాలంలో పండుతాయి. వీటిని రబీ సీజన్లో సాగు చేస్తారు. డిసెంబర్ చివరిలో లేదా జనవరి ప్రారంభంలో కోతకు వస్తాయి. మసాలాల ధరలు జనవరి నాటికి కొంత తగ్గవచ్చని, రాబోయే మూడు నెలల పాటు పెరుగుతూనే ఉంటాయని పరీక్ అనే ఎకనమిస్ట్ తెలిపారు. ఈ ఏడాది చివరిలో పెళ్లిళ్ల సీజన్తో పాటు పండుగ కాలంలో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ధరలు మరింత పెరగవచ్చని అన్నారు. వచ్చే 3 నెలల్లో కనీసం 15 శాతం పెరగవచ్చని పరీక్ అంచనా వేస్తున్నారు.