- సోలాపూర్ కు చెందిన సప్లయర్లతో యూపీ గ్యాంగ్ డీల్
- అడ్డుకుంటే పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్లాన్
- రెండు గ్యాంగ్లను అరెస్ట్ చేసిన మేడ్చల్, మాదాపూర్ ఎస్ వోటీ
- రూ.3 కోట్లు విలువ చేసే 1,228 కిలోల గంజాయి సీజ్
హైదరాబాద్,వెలుగు: గంజాయి మాఫియా కొత్త ఎత్తులు వేస్తున్నది. గంజాయి ట్రాన్స్పోర్టింగ్ను అడ్డుకునేందుకు యత్నిస్తే పోలీసులపై ఫైరింగ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నది. ఇలాంటిదే మహారాష్ట్ర, యూపీకి చెందిన రెండు గ్యాంగ్ లను సోమవారం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని రూ.3 కోట్లు విలువ చేసే 1,228 కిలోల గంజాయి, కంట్రీమేడ్ పిస్టల్, రెండు మ్యాగజైన్స్,14 రౌండ్ల బుల్లెట్లు, మూడు కార్లు, డీసీఎం స్వాధీనం చేసుకున్నారు.ఈ అంతర్రాష్ట్ర ముఠాల వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం వెల్లడించారు.
వైజాగ్ టు మహారాష్ట్ర..
ఉత్తరప్రదేశ్ లోని ముజఫరాబాద్కు చెందిన మహ్మద్ ఇనామ్(30) స్థానికంగా దోపిడీలు, దొంగతనాలు, బైక్ చోరీలు చేస్తుండేవాడు. ముజఫర్నగర్ ,మీరట్, మణిపురి పీఎస్లలో 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడి ఫ్రెండ్ మహ్మద్ సాద్(21)తో కలిసి గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. హర్యానాలో ఉంటున్న కార్ మెకానిక్స్ బంటి కశ్యప్(26), లలిత్కుమార్ కశ్యప్(20)తో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు.
మహారాష్ట్ర సోలాపూర్కు చెందిన గంజాయి పెడ్లర్ బబ్లూ షిండేతో డీల్ కుదుర్చుకున్నాడు. విశాఖపట్నం ఏజెన్సీ అరకు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు గంజాయిని హైదరాబాద్ మీదుగా ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ప్లాన్ చేశాడు. రాష్ట్రంలో పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడంతో అడ్డుకున్న వారిపై దాడి చేసేందుకు కంట్రీమేడ్ పిస్టల్, మ్యాగజైన్స్, బుల్లెట్లను ఇనామ్ కొనుగోలు చేశాడు. అరుకు నుంచి 508 కిలోల గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేందుకు బబ్లూ షిండే నుంచి ఆర్డర్ వచ్చింది.
కంట్రీమేడ్ పిస్టల్తో ఎస్కార్టింగ్
అడ్వాన్స్గా ఇనామ్ రూ.4.5 కోట్లు తీసుకున్నాడు. నలుగురు కలిసి రెండు కార్లతో వైజాగ్ వెళ్లారు. పెడ్లర్ సుభాష్ వద్ద 2,3 కిలోల చొప్పున ప్యాక్ చేసిన 170 ప్యాకెట్లు తీసుకున్నారు. అరకు నుంచి హైదరాబాద్ మీదుగా సోలాపూర్ బయలుదేరారు. ఇనామ్, సాద్ ఎస్కార్ట్గా ముందు ట్రావెల్ చేశారు. ఇలా టోల్ప్లాజాల వద్ద చిక్కకుండా వచ్చారు. గంజాయి సప్లయ్ గురించి మేడ్చల్ ఎస్ వోటీ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో దుండిగల్ పీఎస్ లిమిట్స్లోని ఓఆర్ఆర్పై ఎస్ వోటీ పోలీసులు నిఘా పెట్టారు. ముందుగా ఇనామ్, సాద్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో బంటి కశ్యప్, లలిత్కుమార్ కశ్యప్ను అరెస్ట్ చేశారు. రూ.కోటి 49 లక్షలు విలువ చేసే 508 కిలోల గంజాయి, కంట్రీమేడ్ పిస్టల్, మ్యాగజైన్స్, 14 రౌండ్ల బుల్లెట్లు, రెండు కార్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రిసీవర్ బబ్లూ, సప్లయర్ సుభాష్ పరారీలో ఉన్నారు.
కూరగాయల ట్రేల మధ్య గంజాయి
ఏపీలోని రాజమండ్రికి చెందిన గంజాయి సప్లయర్ రెహమాన్ మహారాష్ట్ర్లోని ఔరంగాబాద్కు గంజాయి తరలిస్తున్నాడు. మహారాష్ట్ర సతరా జిల్లాకు చెందిన డీసీఎం డ్రైవర్ విశాల్ చంద్రకాంత్, సాగర్ భబన్ దేశ్ముఖ్తో కలిసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. ఒక్కో ట్రిప్కు రూ.28 వేలు ఇచ్చేవాడు. ఇందులో భాగంగా మూడ్రోజుల కిందట విశాల్ చంద్రకాంత్, సాగర్ భబన్ దేశ్ముఖ్ రాజమండ్రికి వెళ్లారు.5 కిలోల చొప్పున 720 కిలోల గంజాయిని ప్యాక్ చేశారు.
144 ప్యాకెట్లను కూరగాయల ట్రేల మధ్య అమర్చారు. సోమవారం రాజమండ్రి నుంచి బయలుదేరారు. మాదాపూర్ ఎస్ వోటీ పోలీసులకు అందిన సమాచారంతో నిఘా పెట్టారు. నార్సింగి పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. మంచిరేవుల వద్ద డీసీఎంను అడ్డగించారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. 720కిలోల గంజాయి, డీసీఎం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.కోటి 64 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.