ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై బీజేపీ ఫైర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసదారులకు పౌరసత్వం ఇవ్వడం వల్ల దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కామెంట్లపై బీజేపీ మండిపడింది. సీఏఏ అమలు వల్ల ఎవరూ తమ ఉద్యోగాలను, పౌరసత్వాన్ని కోల్పోరని వెల్లడించింది. సీఏఏపై అబద్ధాలు ప్రచారం చేయటం మానుకోవాలని కేజ్రీవాల్కు సూచించింది. ఢిల్లీ సీఎం కామెంట్లపై బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ బుధవారం స్పందిస్తూ.."సీఏఏ అమలు తర్వాత ఇతర దేశాలకు చెందిన వారికే ఉద్యోగాలు వస్తాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వింత ప్రకటన చేశారు. పాకిస్తాన్, అఫ్గాన్, బంగ్లాదేశ్లోని హిందూ, క్రిస్టియన్, సిక్కు, పార్సీలు హింసకు గురవుతున్నారు. వారికి పునరావాసం కల్పించడం మన నైతిక బాధ్యత కాదా? " అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.