సింగరేణి క్వార్టర్లు ఆక్రమిస్తే కఠిన చర్యలు

సింగరేణి క్వార్టర్లు ఆక్రమిస్తే కఠిన చర్యలు
  • మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలో  సింగరేణి  కార్మికులకు కేటాయించిన, ఖాళీగా ఉన్న  సింగరేణి క్వార్టర్లల్లోకి  ఇతరులు అక్రమంగా చొరబడితే  కఠిన చర్యలు తీసుకుంటామని ఏరియా సింగరేణి యాజమాన్యం గురువారం తెలిపింది.  మూడో జోన్​లోని క్వార్టర్​లో ప్రైవేటు వ్యక్తి ఆక్రమించుకున్నాడని, చట్టప్రకారం ఖాళీ చేయిస్తామని తెలిపింది. 

క్వార్టర్​లోని సామాను తొలగింపుపై వివాదం…

మందమర్రి పట్టణం మూడో జోన్​ డి- 574  సింగరేణి  క్వార్టర్​లో ఉంటున్న ప్రైవేటు వ్యక్తి వేముల శ్రీనివాస్​ కుటుంబాన్ని ఖాళీ చేయించేందుకు సింగరేణి ఎస్అండ్​పీసీ, ఎస్టేట్​ఆఫీసర్లు, సిబ్బంది తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది.  గురువారం ఆఫీసర్ల సమక్షంలో క్వార్టర్​లోని సామగ్రిని బలవంతంగా బయట వేయడంపై  శ్రీనివాస్​ కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. సింగరేణి ఖాళీ క్వార్టర్లలో ఎంతో మంది ప్రైవేటు వ్యక్తులు ఉంటున్నారని, తమను ఎందుకు ఖాళీ చేయిస్తున్నారంటూ వాదనకు దిగారు. కుటుంబ యాజమాని లేని సమయంలో పిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తూ క్వార్టర్​ నుంచి సామగ్రి  బయటపడేయడమేంటని మండిపడ్డారు. మిగిలిన వాళ్లను క్వార్టర్ల నుంచి  ఖాళీ చేయించేంత వరకు తాము ఇందులోనే ఉంటామని భీష్మించుకోవడంతో  సిబ్బంది వెనుదిరిగారు.