కృష్ణాలో వాటాకు పోరాటమేది? : ఎం.కోదండ రామ్

కృష్ణాలో వాటాకు పోరాటమేది? : ఎం.కోదండ రామ్

కృష్ణానది తెలంగాణ జీవధార. మన చరిత్రకు ఆనవాలు. తెలంగాణ అభివృద్ధికి దారి. దురదృష్టవశాత్తు ఇవాళ కృష్ణమ్మతో తెలంగాణకు ఉన్న పేగు బంధం తెగిపోతున్నది. నీళ్లను వాడుకునే అధికారం ఉంటేనే కదా నదితో సంబంధం నిలిచేది. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తొమ్మిది ఏండ్లు గడిచినా పొందలేకపోవడం బాధాకరం. నదీ జలాల్లో వాటాను సాధించడంలో కేసీఆర్​ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో 68.50 శాతం తెలంగాణలో ఉండగా, సీమాంధ్ర  ప్రాంతంలో పరీవాహక ప్రాంతం కేవలం 31.50 శాతం. అయినా తెలంగాణకు దక్కిన నీళ్ళు కేవలం 37 శాతమే. బచావత్ ట్రీబ్యూనల్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించిన నీటిలో  సీమాంధ్రకు 512 టీఎంసీల నీళ్ళు వాడుకున్నది. ఆంధ్రా పాలకులు తెలంగాణకు  కేవలం 299 టీఎంసీ నీళ్ళు మాత్రమే ఇచ్చినారు.  ఆంధ్రా పాలకుల కుట్రల వలన తెలంగాణ నాగార్జున సాగర్, రాజోళి బండ, జూరాల ప్రాజెక్టుల కింద నీటిని పూర్తి సామర్థ్యం వాడుకోలేక పోయింది. ఆ లెక్క తీస్తే మనకు దక్కిన వాటా మరింత తగ్గుతుంది.

సాగునీటి వ్యవస్థ కుప్పకూలింది

చెరువులు బాగున్నన్ని రోజులు తెలంగాణ సమాజం భారీ నీటి పారుదల అవసరాన్ని గుర్తించలేదు. మారిన పరిస్థితిలో భారీ నీటి ప్రాజెక్టుల నుంచి నీళ్ళు తెచ్చి చెరువులు నింపితే తప్ప తెలంగాణలో సాగునీటి వ్యవస్థను స్థిరీకరించే పరిస్థితి లేదు. చాలా సూటిగా చెప్పాలంటే, తెలంగాణ సాగునీటి వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఈ పరిణామం కూడా అంతకు ముందున్న వర్షాధార పంటలు పోయి, నీళ్ళు ఉంటే తప్ప పండని వ్యాపార పంటలు వచ్చినాయి. అందువలన నీళ్ల లేమి తెలంగాణాలో తీవ్రమైన ఆర్థిక, సామాజిక, సంక్షోభాన్ని తీసుకొచ్చింది. ఏ నలుగురు కలిసినా, 1980, 1990 దశకంలో, నీళ్ళ సమస్య గురించి మాట్లాడే వాళ్ళు. రైతుల ఆత్మ హత్యలను ఈ నేపథ్యంలోనే చూడాలి. నీళ్ళు లేక వేసిన పంటలు ఎండిపోయి, పెట్టిన పెట్టుబడి వెళ్లక, అప్పులు మీద పడి రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. ఆ  నీళ్ళ కోసమే ఆనాడు జల సాధన ఉద్యమాలు చేసినం.

నాటి జలసాధన ఉద్యమాలు

కృష్ణానదిలో వాటా దక్కక పోవడంతోనే దక్షిణ తెలంగాణ భారత దేశంలోకెల్లా అత్యంత కరువు పీడిత ప్రాంతంగా మారిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలో 1980 దశకం చివరలో ఆకలి చావులు కూడా నమోదయ్యాయి. బతుకుదెరువు కుప్పకూలి పోవడంతో వలసల జిల్లాగా మారింది. నల్గొండ ఫ్లోరోసిస్ బాధిత జిల్లాగా మారింది. తాగు, సాగునీరు ఇస్తే తప్ప ఆత్మగౌరవంతో బతకడం సాధ్యం కాదని ఈ జిల్లాల ప్రజలు 1980 దశకంలో నిర్వహించిన జలసాధన ఉద్యమాలు తేల్చి చెప్పాయి. అయినా ఆంధ్రా పాలకులకు దయ రాలేదు. పోరాటాలు బలపడిన తరువాత కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు పథకాలు మంజూరైనా వాటి పనులు వేగంగా సాగలేదు. ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం సాగింది. తెలంగాణ వస్తే మన నీళ్ళు మనకు వస్తాయని ఆశ పడినం. మన ప్రాజెక్టులు తొందరగా పూర్తి అయిపోతాయని అనుకున్నాం. అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. 

తొమ్మిదేండ్లలో ఏ ప్రాజెక్టూ పూర్తి కాలేదు

తెలంగాణ ఏర్పడిన నాటికి పెండింగులో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన మొత్తం తక్కువే. నెట్టెంపాడు పూర్తికి 242 కోట్ల రూపాయలు, కోయిలసాగర్ పనులు కావడానికి రూ.107 కోట్లు, ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లు, కల్వకుర్తి కోసం రూ.1,613 కోట్లు, ఉదయ సముద్రం కోసం రూ. 268 కోట్లు, ఎస్ఎల్​బీసీ సొరంగం పూర్తిగా తవ్వడానికి రూ. 729 కోట్లు చాలు. మొత్తం మీద రూ.3059 కోట్లు మంజూరు చేస్తే అదనంగా 5.37లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. ఇంకొక రూ.28,796 కోట్లు కేటాయిస్తే పాలమూరు-–రంగారెడ్డి పథకం, డిండి ప్రాజెక్టు, సీతారామ లిఫ్టు పథకం కూడా పూర్తి అయ్యేవి. ఇంకొక 22.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఏర్పడేది. కానీ ప్రభుత్వం  నిధులు మంజూరు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టులలో అవినీతికి కట్ట వేస్తే పెండింగ్  కృష్ణా ప్రాజెక్టులు పూర్తి  అయిపోయేవి. ఎందుకు కృష్ణా  ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని అడిగితే ఇంజనీర్లు ఇస్తున్న  సమాధానం చాలా కీలకమైనది. అనుమతులు లేకపోవడంతో ఈ ప్రాజెక్టులకు రుణాలు దొరకడం లేదని అంటున్నారు. అనుమతులు ఎందుకు లేవంటే నీటి కేటాయింపులు లేక పోవడం వల్లనే అనుమతులను సాధించ లేక పోయామంటారు. తెలంగాణ విషయానికొస్తే కృష్ణా నదిలో మనకు వాటా కేటాయిస్తే తప్ప మన ప్రాజెక్టులు పూర్తి కావన్నమాట.

నీటి వాటా ఎంత ఆలస్యమైతే.. అంత నష్టం

మన పరిస్థితి ఇట్లా వుండగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచే పనులను మొదలు పెట్టింది. పనులు పూర్తయితే రోజుకు కృష్ణా నుంచి10టీఎంసీల నీళ్ళను ఆంధ్రప్రదేశ్ మళ్లించుకొని పోగలదు. అప్పుడు తెలంగాణ తన వాటాను శాశ్వతంగా కోల్పోతుంది. ఈ ముప్పు ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. వివాదాలను పరిష్కరించి, నీటి పంపకాలను పూర్తి చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. రెండు రాష్ట్రాలు విడిపోయి దాదాపు 9 ఏండ్లు గడిచినా కేంద్ర ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయనే లేదు. మొత్తం కృష్ణా, గోదావరి నదుల నిర్వహణను, ప్రాజెక్టుల నిర్వహణను తన చేతుల్లోకి తీసుకున్నది. నదులపైన, ప్రాజెక్టుల పైన రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిన అధికారాన్ని, 15 జులై 2021 నాడు  ఒక గెజిట్ ద్వారా   కైవసం చేసుకొన్నది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న అనుమతులు లేని ప్రాజెక్టులను ఆపివేయమని ఆదేశించింది. ఈ గెజిట్ కారణంగా ఉన్న అసమానతలు కొనసాగుతాయి. దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే ఈ కీలక సమయంలో మన కొరకు కొట్లాడగల శక్తి లేకుండా పోయింది.

తెలంగాణవాదులు ఏకం కావాలె..

రాష్ట్ర సర్కారు నీటి సాధనకు చిత్తశుద్ధితో పనిచేయదన్న అనుమానాలు ఇప్పుడు ఇంకా పెరిగాయి. ఇప్పుడు టీఆర్​ఎస్​ తన పేరును బీఆర్​ఎస్​గా మార్చుకున్నది. టీఆర్​ఎస్​గా ఉన్నప్పుడే మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ కాదని ప్రకటించి ఉద్యమ ఆకాంక్షల సాధన కర్తవ్యాన్ని గాలికి వదిలేసింది. ఇప్పుడు అది పేరు మార్చుకున్నది. ఆంధ్రాలో కూడా బలమైన పార్టీగా ఎదగాలని ఇప్పుడు బీఆర్​ఎస్​ ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్​ మనకోసం కొట్లాడే అవకాశం లేదు. ఎంతసేపు తమ రాజకీయ ప్రయోజనాల పైనే దృష్టి తప్ప తెలంగాణా సంక్షేమం పైన పట్టింపు లేదు. అమెరికాలో తెలంగాణరాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు చేసినా, తెలంగాణవాదులు ఉత్తరాలు ఇచ్చినా, పత్రికా సమావేశాలు పెట్టినా, సదస్సులు జరిపినా స్పందనలేదు. రాష్ట్రంలోని  అనేక సంఘాలు కూడా విడిగా కృష్ణా జలాల్లో  వాటా సాధన కోసం  ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చలనం లేదు. రాష్ట్ర ప్రజలు, తెలంగాణ వాదులు ఐక్యం కాకుండా మనకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కృష్ణా నదిలో న్యాయమైన వాటా సాధన కోసం, పెండింగు ప్రాజెక్టుల పూర్తి కోసం పోరాటం తప్పదు. 

లిక్కర్​ వ్యాపారుల కోసం వెళ్లారు కానీ.. కృష్ణా నీళ్ల కోసం ఎన్నడూ ఢిల్లీ వెళ్లలె

కృష్ణా జలాల వాటా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాటం చేయడం లేదు. మన తరఫున పోరాడ గల ప్రభుత్వం లేకనే ఆనాడు అన్యాయం జరిగిందని, కోట్లాడి  రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మన ప్రభుత్వమే అధికారంలో ఉన్నా తెలంగాణ సోయితో వ్యవహరించడం లేదు. ఎంతసేపటికి వారి దృష్టి వ్యక్తిగత వ్యాపారాల మీదనే ఉన్నది. అందుకు లిక్కర్ కుంభకోణం ఒక సాక్ష్యం. తమకు కావలసిన వారికి లిక్కర్ వ్యాపారంలో లాభం చేకూర్చడానికి స్వంత విమానాల్లో ఢిల్లీ వెళ్ళిన టీఆర్ఎస్ నాయకులు కృష్ణా నదిలో వాటా సాధించడానికి ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్లలేదు. ఈ తొమ్మిదేండ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించి ఉంటే నీటి వివాదాలు పరిష్కారమై, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి  అవసరమైన పైసలు కూడా తక్కువేనని పైన తెలుసుకున్నాం. అనుమతులు వస్తే లోన్లు దొరికేవీ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. 

- ఎం.కోదండ రామ్,
అధ్యక్షుడు,
తెలంగాణ జన సమితి