
నవ సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించే యువత మత్తు పదార్థాల వ్యసనాలకు బానిసైతే తొలుత వారి కుటుంబంపై, అనంతరం సమాజంపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. పాశ్చాత్య దేశాల నుంచి మన సమాజానికి డ్రగ్స్ సంస్కృతి కూడా పాకడంతో అనేక సమస్యలొస్తున్నాయి. ఇష్టమైన ఆహారం తింటాం, ఇష్టమైన సంగీతంతో మనసు నిండా ఉల్లాసాన్ని నింపుకుంటాం. దురదృష్టవశాత్తు అదే కోవలో మత్తుతో ఉందిలే హాయి అంటూ డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్న యువత జీవితాన్ని దుర్లభం చేసుకోవడమే కాకుండా, వ్యసనాలతో అనారోగ్యం బారిన పడుతోంది.
నేటి వేగవంతమైన అత్యాధునిక సమాజంలో ఒత్తిడి తట్టుకోలేక కొందరు, ఇతర ఆకర్షణలతో కొందరు, ప్రతిష్ట కోసం మరికొందరు ఇలా అన్ని వర్గాలు, అన్ని రంగాలకు చెందిన ఉన్నత కుటుంబాలు మొదలుకొని పేద, మధ్య తరగతి కుటుంబాల వరకు డ్రగ్స్ మత్తుకు బానిసలవుతున్నారు. యువత ప్రధానంగా అభం శుభం తెలియని విద్యార్థులు మత్తు వలలో చిక్కుకొని చిత్తవుతున్నారు. చదువులకు దేవాలయాలైన పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల ప్రాంగణాలు మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతుండడం శోచనీయం.
దేశంలో తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలూ డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలతో సతమతమవుతూ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడి కోసం చేసిన ప్రకటన ఆశాజనకంగా ఉంది. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 26న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఉద్యమాల గడ్డ అయిన తెలంగాణను మాదకద్రవ్యాల అడ్డాగా మారకుండా రాష్ట్రంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఇకపై ‘ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్’ (ఈగల్)గా మార్చి డేగ కన్నుతో నిఘా పెడతామని చెప్పారు.
సీఎం ఆదేశాలకు అనుగుణంగా మహమ్మారిగా మారుతున్న డ్రగ్స్ను కట్టడి చేయడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడా గంజాయి మొక్కలను పెంచకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాక ఏ సరిహద్దు నుంచైనా రాష్ట్రంలోకి డ్రగ్స్ రవాణా కాకుండా ‘ఈగల్’ నిఘా పెడితే తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారడం ఖాయం. విద్యాబుద్ధులను నేర్పించాల్సిన విద్యా సంస్థలు డ్రగ్స్ స్థావరాలుగా మారడంపై కన్నెర్రజేసిన ముఖ్యమంత్రి పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
మత్తు మాఫియా గ్యాంగ్లు
డ్రగ్స్ మాఫియాలు విద్యాసంస్థల పరిసరాలలో చాక్లెట్లు అమ్మినట్టు మాదకద్రవ్యాలు అమ్ముతూ విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతున్నాయి. గ్రేటర్ నడిబొడ్డున, శివారు ప్రాంతాల్లోని ప్రముఖ పాఠశాలలు, కళాశాలలతో పాటు యునివర్సిటీ పరిసరాలను కూడా అడ్డాగా చేసుకున్న మత్తు మాఫియా గ్యాంగులు పిల్లలకు, యువతకు మత్తుపిచ్చి ఎక్కిస్తున్నారు. ఈ విషబీజాన్ని మొగ్గలోనే తుంచేయాలనే భావనతో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని విద్యా సంస్థల తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
తల్లిదండ్రులు ఎంతో విశ్వాసంతో అప్పులు చేసి ప్రముఖ విద్యాసంస్థల్లో పిల్లలను చేర్పిస్తే కొన్ని యాజమాన్యాలు కేవలం వ్యాపార దృక్పథంలోనే ఆలోచిస్తూ పిల్లల బాగోగులను ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. కొన్ని విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు కూడా ఇందుకు సహకరిస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కేవలం చదువు చెప్పడానికే పరిమితం కాకుండా మన సమాజం చెడు వ్యసనాలకు లోనవుకుండా విద్యాసంస్థకు వచ్చిన విద్యార్థి మళ్లీ ఇంటికెళ్లే వరకూ యాజమాన్యాలు గురుతర బాధ్యత తీసుకొని వ్యవహరిస్తే విద్యార్థుల్లో దుర్వ్యసనాలను కట్టడి చేయవచ్చు.
పెను సవాల్
విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాలు ఒకవైపు ఆందోళనకరమైతే, మరోవైపు కొందరు ప్రముఖ రాజకీయ వారసులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు డ్రగ్స్ను వాడుతూ పట్టుబడిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటివారు ఎంత ప్రముఖులైనా కఠినచర్యలు తీసుకుంటే సమాజానికి సానుకూలమైన సందేశం ఇచ్చినట్టువుతుంది. లాటిన్ అమెరికాలో తయారవుతున్న డ్రగ్స్ను అంతర్జాతీయ ముఠాలు హైదరాబాద్కు తరలిస్తున్నాయి. మరోవైపు నైజీరియన్కు చెందిన ముఠాలు కూడా డ్రగ్స్ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
డ్రగ్స్ మాఫియా ముఠాలకు ప్రముఖుల అండదండలుండడంతో డ్రగ్స్ను అరికట్టడంలో లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి, నగరాల్లో ప్రధానంగా హైదరాబాద్లో కొకైన్, హెరాయిన్ వాడకం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ‘ఈగల్’కు రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ కట్టడి అంత సులభతరం కాదు. పెను సవాలే.
డ్రగ్స్నేరాలపై ఉక్కుపాదం
తెలంగాణలో మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం తీసుకొస్తున్న ‘ఈగల్’కు కీలకమైన బాధ్యతలు, లక్ష్యాలున్నాయి. రాష్ట్రంలో గంజాయి మొక్కల సాగును కట్టడి చేయడం, రాష్ట్ర అన్ని సరిహద్దుల నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నివారించడం, మాదక ద్రవ్యాల నేరాలపై ఉక్కుపాదం, డ్రగ్స్ సరఫరాపై కఠిన చర్యలు, విద్యార్థుల్లో, యువతలో డ్రగ్స్తో జరిగే నష్టాలపై అవగాహన కల్పించడం, డ్రగ్స్ అడిక్షన్ నిరోధక కేంద్రాలు ఏర్పాటు చేసి రిహాబిటేషన్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తారు.
వీటితో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో పది మంది సభ్యులతో ‘ఈగల్’ కమిటీలు ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా డ్రగ్స్ బారిన పడినవారిని తిరిగి మామూలు వ్యక్తులుగా మార్చేలా తగిన చికిత్స అందించేందుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా 26 ఆస్పత్రుల్లో 270 పడకలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డ్రగ్ అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
డ్రగ్స్రహిత తెలంగాణ
డ్రగ్స్కు కావాల్సిన డబ్బుకోసం కొందరు చేస్తున్న అరాచకాలు ఇప్పుడు నిత్యం వార్తలు అవుతున్నాయి. కొన్నిచోట్ల దౌర్జన్యాలకు, హత్యలకు కూడా డ్రగ్స్ కారణాలవుతున్నాయి. డ్రగ్స్ మత్తులో అత్యాచారాలు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే మద్యంషాపుల వద్ద, కొన్ని కూడళ్ల వద్ద, మరికొన్ని నిర్మానుష్య ప్రదేశాలు వీరికి అడ్డాలుగా మారుతోండటంతో సామాన్యులు అటువైపు వెళ్లడానికే జంకుతున్నారు. ప్రమాదకరమైన డ్రగ్స్ నిర్మూలనకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది.
డ్రగ్స్ సమస్యపై కఠినచర్యలు తీసుకుంటే ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ‘ఈగల్’ ప్రకటన సందర్భంగా చేసిన సూచనలు, హెచ్చరికలు సానుకూలంగా పనిచేయడం ప్రారంభించాయి. మాదకద్రవ్యాల వినియోగానికి చెల్లుచీటి పలికేందుకు తొలుత హైదరాబాద్ కేంద్రంగా సన్నాహాలు మొదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూలలో విద్యార్థులతో కమిటీలు ఏర్పడడమే కాకుండా విద్యార్థులకు ఈ మహమ్మారితో కలిగే నష్టాలపై అవగాహన కల్పించి, చైతన్యపరిచేందుకు ప్రదర్శనలు నిర్వహించడం శుభపరిణామం.
ఉద్యమాలకు నెలవైన తెలంగాణలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అన్ని వర్గాలు కలిసికట్టుగా చేయిచేయి కలిపి మరో ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. రాష్ట్రంలో డ్రగ్స్ నివారణకు ‘ఈగల్’ డేగ కన్నుతో నిఘా పెడితే మనందరం ఆశించినట్టు తెలంగాణ మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా ఆవిర్భవించడం ఎంతో దూరంలో లేదు.
పంజాబ్ను అధిగమించిన కేరళ
ఎన్డీపీఎస్ లెక్కల ప్రకారం తెలంగాణ ఏర్పడిన 2014లో 169 కేసులు నమోదుకాగా, 148 అరెస్టులు జరిగాయి. 2024 సంవత్సరానికి కేసులు 842కు పెరగగా 1,445 మంది అరెస్టయ్యారు. తెలంగాణతో పోలిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో డ్రగ్స్ తీవ్రత మరింత ఎక్కువగా ఉందని ఎన్డీపీఎస్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి.
ఇప్పుడు దక్షిణాది రాష్ట్రమైన కేరళ పంజాబ్ను అధిగమించడంతో ఆ రాష్ట్రంలో యువతకు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఎన్డీపీఎస్ నివేదిక ప్రకారం మాదకద్రవ్యాలకు సంబంధించి 2024లో పంజాబ్లో 9,025 కేసులు నమోదుకాగా, దీనికి మూడురెట్లు అధికంగా కేరళ రాష్ట్రంలో 27,701 కేసులు నమోదు కావడం ఆందోళనకరం. 2024 లెక్కల ప్రకారం దేశంలో అక్రమంగా మాదకద్రవ్యాల వాడకాన్ని పరిశీలిస్తే ప్రతి లక్షమందికి పంజాబ్లో 30 మందిపై, కేరళలో 78 మందిపై డ్రగ్స్ కేసులు నమోదు కావడం ఆ రాష్ట్రాలకే కాదు దేశానికి కూడా ప్రమాద హెచ్చరికలే. అధిక అక్షరాస్యతతో విద్యావంతులు ఎక్కువగా ఉన్న కేరళ రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ కేసులు నమోదు కావడం ఆధునిక విశృంఖాలకు నిదర్శనం.
- ఐ.వి.మురళీకృష్ణ శర్మ-