- మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర జ్యోతిబా పూలే గురుకులంలో ఘటన
చిన్నచింతకుంట, వెలుగు: తమపై టీచర్లకు చాడీలు చెబుతున్నారని కొందరు స్టూడెంట్లు తోటి విద్యార్థులపై దాడి చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. గురుకుల ప్రిన్సిపాల్ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం. చిన్నచింతకుంట మండలానికి చెందని బీసీ వెల్ఫేర్ బాలుర పాఠశాలను దేవరకద్రలో నిర్వహిస్తున్నారు. 9వ తరగతికి చెందిన నలుగురు స్టూడెంట్లు టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే క్లాస్ కు చెందిన కొందరు స్టూడెంట్లు రోజూ బయటకు వెళ్లి వస్తున్నారని టీచర్లకు కంప్లైంట్ చేసింది వారేనని అనుమానించారు.
ఆ నలుగురు ఉంటున్న గదిలోకి ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో 15 మంది స్టూడెంట్లు వెళ్లారు. లైట్లు బంద్ చేసి నలుగురు విద్యార్థులపై దాడి చేశారు. దీంతో వారి వీపులు, ముఖాలపై గాయాలయ్యాయి. దాడి చేసిన విషయాన్ని బయటకు చెబితే మళ్లీ దాడి చేస్తామని చెప్పడంతో, ఆ నలుగురు స్టూడెంట్లు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
అక్కడ పని చేస్తున్న వంట మనిషికి తెలియడంతో సోమవారం రాత్రి ప్రిన్సిపాల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. దేవరకద్ర ఎస్సై నాగన్న గురుకులానికి చేరుకొని విచారణ చేశారు. దాడికి పాల్పడిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఘటన గురించి ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు దాడి చేసిన15 మంది స్టూడెంట్లకు టీసీ ఇచ్చి పంపించారు.
