న్యూఢిల్లీ: చక్కెర (షుగర్) ప్రొడక్షన్ తగ్గుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 1 – డిసెంబర్ 15 మధ్య ఉత్పత్తి అయిన చక్కెర ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 11 శాతం తగ్గి 74.05 లక్షల టన్నులుగా రికార్డయ్యింది. షుగర్ మార్కెటింగ్ ఇయర్ అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. కిందటేడాది ఇదే టైమ్లో 82.05 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అయ్యింది.
కార్యకలాపాలు కొనసాగించిన ఫ్యాక్టరీలు 497 గా ఉన్నాయని, వీటిలో ఎటువంటి మార్పు లేదని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) పేర్కొంది. కానీ, మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని ఫ్యాక్టరీలు 10 – 15 రోజులు లేటుగా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాయని వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్లో చక్కెర ప్రొడక్షన్ అక్టోబర్ 1 – డిసెంబర్ 15 మధ్య 22.11 లక్షల టన్నులుగా నమోదయ్యింది. కిందటేడాది మార్కెటింగ్ ఇయర్లోని ఇదే టైమ్లో ఈ 20.26 లక్షల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేసింది.
అదే మహారాష్ట్రలో అయితే చక్కెర ప్రొడక్షన్ 33.02 లక్షల టన్నుల నుంచి 24.45 లక్షల టన్నులకు తగ్గింది. కర్నాటకలో అయితే 19.20 లక్షల టన్నుల నుంచి 16.95 లక్షల టన్నులకు పడింది. ఇథనాల్ కోసం చెరుకును వాడకపోతే ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్లో 325 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని ఇస్మా అంచనా వేస్తోంది. దేశంలో చక్కెర డిమాండ్ 285 లక్షల టన్నులుగా ఉంది.
ప్రభుత్వం దగ్గర 56 లక్షల టన్నుల స్టాక్ ఉంది. దేశంలో చక్కెర ధరలను కంట్రోల్ చేసేందుకు, సప్లయ్ సమస్యలు లేకుండా చూసేందుకు ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్లో ఎగుమతులను ప్రభుత్వం బ్యాన్ చేసింది. కిందటి మార్కెటింగ్ ఇయర్లో 64 లక్షల టన్నులను ఎగుమతి చేశాం. కాగా, 17 లక్షల టన్నుల చెరుకు రసం, బీ– హెవీ మొలాసిస్ను ఇథనాల్ తయారీకి వాడుకోవడానికి కిందటి వారం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.