
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటలో సుపారీ గ్యాంగ్ ఒకరిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించడం హల్చల్ చేసింది. వివరాలిలా ఉన్నాయి.. మోతే మండలం రాఘవపురం గ్రామంలో వంగాల కిరణ్ గౌడ్ అనే వ్యక్తికి క్రషర్ మిల్లు ఉండగా, దాని పక్కనే అదే గ్రామానికి చెందిన పజ్జూరి వెంకటేశ్వర్లుకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన క్రషర్ ఓనర్ వెంకటేశ్వర్లుతో తరచూ గొడవ పడుతున్నాడు. అయినా భూమి దక్కక పోవడంతో వెంకటేశ్వర్లును అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించాడు. భూమి ఎలాగైనా దక్కించుకునేందుకు వెంకటేశ్వర్లును హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ను ఆశ్రయించాడు.
నార్కట్ పల్లి మండలం యల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మేడి శివప్రసాద్, బొడ్డుపల్లి స్వామి, గంగాదేవి నరసింహ, బరిగెల శివశంకర్, మాదగిని రమేశ్, బొజ్జ చందుతో వెంకటేశ్వర్లును చంపేందుకు రూ. లక్షకు ఒప్పందం చేసుకున్నాడు. వారు ఆరు రోజులుగా సూర్యాపేటలో రెక్కీ నిర్వహిస్తున్నారు. శుక్రవారం మహేంద్ర ట్రాక్టర్ షోరూం వద్ద వెంకటేశ్వర్లును హత్య చేసేందుకు యత్నించగా, అనుమానంతో వారిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దీంతో సుపారీ గ్యాంగ్ గుట్టు రట్టయింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.