న్యూఢిల్లీ: పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సంస్థ కోర్టు ధిక్కార నోటీసుకు సమాధానం ఇవ్వడంలో విఫలమవడంతో పతంజలి వ్యవస్థాపకుడు రామ్దేవ్కు మంగళవారం నోటీసును జారీ చేసింది. తదుపరి విచారణకు రామ్దేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. గతంలో విచారణ సందర్భంగా ఆచార్య బాలకృష్ణపై కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది.
డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకర ప్రకటనలు చట్టం)లోని నిబంధనలను ప్రాథమికంగా ఉల్లంఘించినట్లు కనిపిస్తోందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ చట్టంలో పేర్కొన్న వ్యాధులు లేదా రుగ్మతలను పరిష్కరించడానికి తమ మందులు పనిచేస్తాయని ప్రకటనలు ఇవ్వకుండా అత్యున్నత న్యాయస్థానం గత విచారణ సందర్భంగా నిషేధించింది. ఈ చట్టం ప్రకారం, ఊబకాయం, ఉబ్బసం, మధుమేహం క్యాన్సర్ వంటి వ్యాధుల చికిత్స కోసం కొన్ని ప్రకటనలను నిషేధించారు. కోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ కంపెనీ తప్పుడు ప్రకటనలను కొనసాగించిందని జడ్జీలు మండిపడ్డారు.