కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో ఆదివారం సాయంత్రం ఐఎస్ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తాలిబాన్లు ప్రకటించారు. ఈ మేరకు అఫ్గాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాబూల్ సిటీలోని డిస్ట్రిక్ట్ 17లో ఐఎస్ టెర్రరిస్టులు దాగి ఉన్న స్థావరాలపై దాడులు చేశామని, ఈ ఆపరేషన్లో ఉగ్రవాదులను చంపేశామని తాలిబాన్ ఫైటర్లు చెప్పానట్లుగా టోలో న్యూస్ సంస్థ పేర్కొంది. అయితే ఈ ఆపరేషన్లో ఎంత మంది మరణించారన్నది మాత్రం వెల్లడించలేదు. అయితే ఆదివారం ఉదయమే కాబూల్లోని ఒక మసీదు దగ్గర బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 12 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోగా.. 32 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని తాలిబాన్ల అధికార ప్రతినిధి ఖ్వారీ సయీద్ ఖోస్తీ తెలిపారు. ఉదయం ఈ పేలుడు ఘటన జరిగిన నేపథ్యంలో.. సాయంత్రానికి ఐఎస్ ఉగ్రవాదులను వాళ్లు దాగి ఉన్న స్థావరాలపై అటాక్ చేసి మట్టుపెట్టామని తాలిబాన్లు ప్రకటించుకోవడం గమనార్హం.
అఫ్గాన్ను తాలిబాన్లు తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఆగస్టు నెల చివరిలో కాబూల్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు దగ్గర ఐఎస్ ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 150 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా పేలుడు ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో అఫ్గాన్లో రెండు టెర్రర్ గ్రూప్ల మధ్య వార్ నడుస్తోంది.
మరిన్ని వార్తల కోసం..