ముఖం మీద చిన్న మొటిమ కనిపించినా.. కొంచెం మచ్చ పడ్డా మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు వాడుతున్నారు. రెడీమెడ్ ఫేస్ప్యాక్లు, స్ర్కబ్లతో అందానికి మెరుగులు దిద్దుతున్నారు. కానీ కెమికల్స్తో నిండిన వాటివల్ల లాంగ్టైమ్లో చర్మానికి హాని తప్ప మేలు ఉండదు. అందువల్ల ఖరీదైన కాస్మోటిక్స్కి కాస్త బ్రేక్ ఇచ్చి చింతపండు ఫేస్ప్యాక్, స్క్రబ్బర్లను ఇంట్లోనే తయారుచేసుకుని వాడండి. దీనివల్ల మెటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
ఫేస్ స్క్రబ్
ఒక టేబుల్ స్పూన్ చింతపడుని వేడి నీళ్లల్లో ఉడికించి గుజ్జు తీయాలి. అందులో ఒక టీ స్పూన్ చక్కెర, ఒక టీ స్పూన్ మిల్క్ క్రీమ్ వేసి బాగా కలిపి ముఖం, మెడభాగాలకు పట్టించాలి. చేతివేళ్లను గుండ్రంగా తిప్పుతూ పదినిమిషాలు మసాజ్ చేయాలి. ఈ ప్యాక్ తరచూ వేసుకుంటే చింతపండు గుజ్జులోని ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది. పొడిచర్మం ఉన్నవాళ్లు మిల్క్క్రీమ్కి బదులు పెరుగు వాడొచ్చు.
స్కిన్ లైట్నింగ్ ప్యాక్
ముప్పై గ్రాముల చింతపండుని ఒక కప్పు నీళ్లలో వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. చల్లారాక చింతపండు గుజ్జు తీయాలి. అందులో అర టీ స్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించాలి. 15 నుంచి 20 నిమిషాలు ఉంచి తరువాత శుభ్రం చేయాలి. ఇలా రెండురోజులకొకసారి చేస్తే పసుపు, చింతపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మృతకణాలను, ముఖం మీద నల్లటి మచ్చలను తొలగించి చర్మాన్ని మెరిపిస్తాయి.