
- కరీంనగర్ జిల్లాలో వస్త్ర ఉత్పత్తిదారులకు రూ.1.50 కోట్ల మోసం
గంగాధర, వెలుగు : కరీంనగర్ జిల్లాలో వస్త్ర ఉత్ప త్తిదారుకుల తమిళనాడుకు చెందిన వ్యాపారులు రూ.1.50 కోట్లు టోకరా వేసి పారిపోయారు. పోలీసు లు, బాధితుల కథనం మేరకు.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పెరుగోపనపల్లి చెందిన వినోద్రాజ్ మరో ఇద్దరితో కలిసి గంగాధర మండలం గర్శకుర్తిలో ఆపిల్ టెక్స్టైల్స్ హోల్సేల్ డీలర్స్ పేరిట 8 నెలల కింద ఆఫీసు తెరిచారు. అక్కడే అద్దెకు ఉంటున్నారు.
స్థానిక వస్త్ర ఉత్పత్తి దారుల వద్ద చీరలు, టవల్స్, కర్చీఫ్స్, రెడీమెడ్ డ్రెస్సులు కొనుగోలు చేశారు. వాటికి కొంత నగదుగా.. మరికొంత అమౌంట్ చెక్కుపై రాసిచ్చారు. ఇలా వినోద్ రాజ్ ముఠా రూ. కోట్లలో కొనుగోలు చేసింది. బకాయిలు పేరుకుపోవడంతో ఉత్పత్తిదారులు పేమెంట్ కోసం వినోద్రాజ్పై ఒత్తిడి చేస్తుండగా.. తమ బాగోతం బయటపడతుందని ముందే తెలిసి మరిన్ని వస్త్రాలను కొనుగోలు చేసుకుని ఈనెల 16న బోలెరోలో వెళ్లిపోయారు.
వారం రోజులుగా ఆఫీసుకు లాక్ వేసి ఉండడం, ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండడంతో మోసపోయినట్టు గ్రహించారు. గర్శకుర్తికి చెందిన పది మంది ఉత్పత్తిదారుల నుంచి రూ.కోటి విలువైన సరుకు కొనుగోలు చేయడంతో లబోదిబోమంటున్నారు. గర్శకుర్తికి చెందిన మిట్టపెల్లి రాజేశం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు.