
- త్వరలో నోయెల్ టాటా, ఎన్ చంద్రశేఖరన్తో ఉన్నత అధికారుల సమావేశం
- గ్రూప్ కంపెనీల కార్యకలాపాలు దెబ్బతినకుండా చూసుకోవడమే ముఖ్యం
న్యూఢిల్లీ: టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య గొడవ ముదురుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎన్బీసీటీవీ18 రిపోర్ట్ ప్రకారం, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ త్వరలో ఉన్నత ప్రభుత్వ అధికారులతో సమావేశం కానున్నారు. టాటా ట్రస్ట్స్లోని ప్రధాన షేర్హోల్డర్ల మధ్య విభేదాలు టాటా సన్స్ కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది.
టాటా సన్స్లో టాటా ట్రస్ట్స్కి మెజారిటీ వాటా ఉంది. ఈ రెండింటి మధ్య గొడవ ముదిరితే టాటా గ్రూప్ కంపెనీల కార్యకలాపాలు దెబ్బతినొచ్చు. ఈ విషయంపై టాటా సన్స్ నుంచి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ మధ్య విభేదాలను పరిష్కరించడం ఈ మీటింగ్ ప్రధాన లక్ష్యం. ఈ గొడవ ప్రభావం గ్రూప్ కంపెనీల కార్యకలాపాలపై పడకుండా చూడాల్సిన అవసరం ఉంది.
గొడవకు కారణాలు..
రతన్ టాటా మరణం తర్వాత ట్రస్టీల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగాయి. ముఖ్యంగా, టాటా సన్స్ బోర్డులో నామినేటెడ్ డైరెక్టర్ల నియామకంలో టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య గొడవ నెలకొంది. బోర్డు సమావేశాల సమాచారం ట్రస్టీలతో ఎంతవరకు పంచుకోవాలి అనే అంశంపైనా విభేదాలు ఉన్నాయి. ఈ అంతర్గత వివాదం ఇప్పుడు టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్లు, ఇతర స్టేక్హోల్డర్ల మధ్య చర్చకు దారి తీసింది. కంపెనీలో కొన్ని బోర్డు స్థానాలు ఖాళీగా ఉండగా, ట్రస్ట్స్ నిర్ణయం లేకుండా బోర్డుని రీఆర్గనైజ్ చేయడం కష్టంగా మారింది. మరోవైపు టాటా సన్స్ ఐపీఓకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం మార్కెట్లో లిస్ట్ కావాల్సి ఉంది.