
ముంబై: టాటా మోటార్స్ సబ్సిడరీ కంపెనీ టాటా టెక్నాలజీస్ సెబీ వద్ద ఐపీఓ పేపర్లు ఫైల్ చేసింది. ఈ ఐపీఓ కింద 8,11,33,706 షేర్లను అమ్మాలని టాటా మోటార్స్ ప్లాన్ చేస్తోంది. టాటా టెక్నాలజీస్లో మరో ఇద్దరు షేర్ హోల్డర్లు ఆల్ఫా టీసీ హోల్డింగ్స్, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ కూడా ఈ ఆఫర్లో వాటి వద్ద ఉన్న వాటాలను అమ్మనున్నాయి. టాటా టెక్నాలజీస్లో వాటా అమ్మకం వల్ల టాటా మోటార్స్కి డబ్బు రావడంతోపాటు, బాలెన్స్షీట్ స్ట్రాంగ్ అవుతుందని టీసీజీ ఏఎంసీ ఎండి చక్రి లోక ప్రియ చెప్పారు. అమెరికాతో పాటు, ఇతర అడ్వాన్స్డ్ మార్కెట్లలోనూ ఈ సెగ్మెంట్పట్ల ఆసక్తి పెరుగుతోందని పేర్కొన్నారు. టాటా టెక్నాలజీస్ ఐపీఓ మంచి పరిణామమేనని అన్నారు. టాటా టెక్నాలజీస్ కోసం గతంలో ఒక్కో షేరుకు రూ. 7.40 చొప్పున టాటా మోటార్స్ చెల్లించింది. ఇది ఆఫర్ ఫర్ సేల్ కావడం వల్ల షేర్ల అమ్మకంతో తమ కంపెనీకి డబ్బులేవీ రావని, వాటాదారులకే వెళ్తాయని టాటా టెక్నాలజీస్ తెలిపింది. ఐపీఓలో షేర్ ధర ఎంతనేది తర్వాత నిర్ణయించనున్నారు. డిసెంబర్ 2022 తో ముగిసిన 9 నెలల కాలంలో టాటా టెక్నాలజీస్ రూ.3,011 కోట్ల రెవెన్యూ మీద రూ. 407 కోట్ల నికర లాభం సంపాదించింది.