
- 31 కోర్సుల్లో లక్ష మందికి శిక్షణ
- రాష్ట్ర ప్రభుత్వంతో టాటా ఒప్పందం
హైదరాబాద్, వెలుగు : గ్లోబల్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసెస్ కంపెనీ అయిన టాటా టెక్నాలజీస్, రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను స్కిల్డెవలప్మెంట్ సెంటర్లుగా (ఎస్డీసీ) ఆధునీకరించనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో 5 సంవత్సరాలకు మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (ఎంఓఏ) పై సంతకం చేసింది. ఈ ప్రాజెక్టుకు రూ. 2,324 కోట్లు ఖర్చు అవుతుంది. దీనివల్ల అధిక నైపుణ్యం గల వారి సంఖ్య పెరగనుంది.
అంతేగాక తెలంగాణలో తయారీ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలనుకునే పరిశ్రమల నుండి పెట్టుబడులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఐటీఐలను అప్గ్రేడ్ చేయడానికి టాటా టెక్నాలజీస్ 20 గ్లోబల్ ఇండస్ట్రీ పార్టనర్లతో కలసి పనిచేస్తోంది. ఇది పరిశ్రమ ఆధునిక అవసరాలకు అనుగుణంగా 8 దీర్ఘకాలిక కోర్సులు, 23 స్వల్పకాలిక కోర్సులను అందిస్తుంది, దీర్ఘకాలిక కోర్సుల్లో 9,000 మంది విద్యార్థులకు, లక్ష మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ వెరిఫికేషన్ వర్చువల్ అనాలిసిస్, హస్తకళల డిజైన్, 3డి ప్రింటింగ్, మోడరన్ ఆటోమోటివ్ మెయింటెనెన్స్ రిపేర్ ఓవర్హాల్, బ్యాటరీ, ఓవర్హాల్ వంటి రంగాలకు సంబంధించిన విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఎంఓఏ సంతకం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చడానికి టాటా టెక్నాలజీస్తో కలిసి పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. డిమాండ్ ఉన్న నైపుణ్యాలపై శిక్షణను అందిస్తుంది. స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలకు దారి తీస్తుంది. పరిశ్రమ 4.0 తయారీ కోసం స్మార్ట్ టెక్నాలజీలను స్వీకరించడానికి ఆసక్తి ఉన్న పరిశ్రమల నుంచి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయి”అని ఆయన వివరించారు. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి... డిమాండ్, సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని టాటా టెక్నాలజీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు.