టీచర్లకు ప్రమోషన్లు.. ఎస్ఏలకు హెచ్ఎంలుగా, ఎస్జీటీలకు ఎస్ఏలుగా ప్రమోషన్లు

టీచర్లకు ప్రమోషన్లు.. ఎస్ఏలకు హెచ్ఎంలుగా, ఎస్జీటీలకు ఎస్ఏలుగా ప్రమోషన్లు

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. స్కూల్ అసిస్టెంట్ల(ఎస్ఏ)ను మల్టీ జోన్​– 1, మల్టీ జోన్​–-2 పరిధిలో హెడ్మాస్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చారు. ఎస్జీటీల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయడంతోపాటు డేట్ ఆఫ్​జాయినింగ్, డీఎస్సీ, డిపార్ట్​మెంటల్ టెస్ట్​లు రాసిన అంశాలను పరిగణలోకి తీసుకొని సీనియార్టీని ఫిక్స్​చేశారు. అయితే ఒక పోస్టుకు ముగ్గురిని పరిశీలించారు. అప్పట్లో ప్రమోషన్లపై హైకోర్టు స్టే విధించింది. 

తాజాగా స్టే ఎత్తి వేయడంతో ఎస్ఏ, ఎస్జీటీలకు ప్రమోషన్ల ప్రక్రియ మొదలైంది. సబ్జెక్టుల వారీగా ఎస్జీటీలకు రోస్టర్ పద్దతిలో స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.  అదే విధంగా వీటిలో ఎస్సీ టీచర్లకు 15 శాతం, ఎస్​టీలకు 10 శాతం, దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఈనెల 26లోగా పూర్తి చేయనున్నారు.

యాదాద్రిలో హెచ్​ఎంలుగా 19 మంది..

యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పరిధిలోని అన్ని మేనేజ్​మెంట్లలోని 754 స్కూల్స్​లో 3,357 టీచర్​ పోస్టులు శాంక్షన్​గా ఉన్నాయి. మొత్తంగా 619 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సబ్జెక్ట్​ల వారీగా స్కూల్​అసిస్టెంట్​పోస్టులు 164 ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ స్కూల్స్​లోని 19 మంది స్కూల్​ అసిసెంట్లకు సీనియార్టీ ప్రకారం హెడ్మాస్టర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. మల్టీ జోన్–-1 పరిధిలోని వివిధ జిల్లాల్లోని స్కూల్స్​కు వీరు వెళ్లాల్సి ఉండగా, 11 మందికి యాదాద్రి జిల్లాలోనే పోస్టింగ్ లభించింది. 

జోన్​ పరిధిలోని వివిధ జిల్లాల్లోని స్కూల్స్​కు వెళ్లిన ఐదుగురు హెచ్​ఎంలుగా బాధ్యతలు స్వీకరించారు. మరో ముగ్గురు నాట్​విల్లింగ్ ఇచ్చి తాము పని చేస్తున్న స్కూల్స్​లోనే స్కూల్​ అసిస్టెంట్లుగా కొనసాగుతున్నారు. జిల్లాలో సబ్జెక్ట్​ల వారీగా ఖాళీగా ఉన్న 164 స్కూల్​ అసిస్టెంట్లు పోస్టుల్లో రోస్టర్​పద్ధతిలో 70 మందికి ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా భర్తీ చేయనున్నారు. 

నల్గొండలో 50, సూర్యాపేటలో 25 మందికి..

మల్టీ జోన్‌–-2 పరిధిలోని నల్గొండ జిల్లాలో 50 హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని స్కూల్ అసిస్టెంట్లకు కేటాయించి ప్రమోషన్లు ఇచ్చారు. వీరిలో 42 జిల్లా పరిషత్ కు చెందిన వారికి ప్రమోషన్లు పొందగా, మరో 8 మంది గవర్నమెంట్ హైస్కూల్ చెందిన ఎస్ఏలకు ప్రమోషన్లు పొందారు. 

సూర్యాపేట జిల్లాలో 25మందికి ప్రమోషన్లు పొందారు. వీరిలో 22 మంది జిల్లా పరిషత్ కు చెందినవారికి ప్రమోషన్లు పొందగా, మరో ముగ్గురు గవర్నమెంట్ హైస్కూల్ కు చెందిన ఎస్ఏ లకు ప్రమోషన్లు పొందారు. కాగా ఇక్కడి నుంచి నలుగురు ఇతర జిల్లాలకు వెళ్లగా, మరో నలుగురు సూర్యాపేట జిల్లాకు వచ్చారు. ప్రమోషన్లు పొందిన వారు వెంటనే విధుల్లో చేరాలని ఎడ్యూకేషన్​ డిపార్ట్​మెంట్​ఆదేశించింది.