లండన్: అన్ని ఫార్మాట్లలోనూ నిరాశ పరుస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అండగా నిలిచాడు. అతని ఫామ్ గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతుందో తనకు అర్థం కావడం లేదన్నాడు. ఇంగ్లండ్తో రెండో వన్డేలోనూ 16 రన్స్కే ఔటవడంతో కోహ్లీపై విమర్శల దాడి మరింత పెరిగింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో విరాట్ ఫామ్ గురించి మీడియా ప్రతినిధి పదే పదే ప్రశ్నించడంతో రోహిత్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ‘కోహ్లీ గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. తను ఎంతో కాలంగా జట్టులో ఉన్నాడు. ఎన్నో మ్యాచ్లు ఆడాడు. కోహ్లీ గొప్ప బ్యాటర్, కాబట్టి అతనికి ఎలాంటి భరోసా అవసరం లేదు. ఫామ్ కోల్పోవడం, తిరిగి అందుకోవడం ప్రతీ క్రికెటర్ కెరీర్లో ఓ భాగమని నేను ఇది వరకే చెప్పా. గొప్ప క్రికెటర్లు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎన్నో మ్యాచ్ల్లో ఇండియాను గెలిపించిన వ్యక్తి (కోహ్లీ) తిరిగి పుంజుకునేందుకు ఒకటి రెండు ఇన్నింగ్స్లు అవసరం.
ఈ విషయంలో చాలా చర్చ జరుగుతోందని నాకు తెలుసు. ఏళ్లుగా ఆడుతున్న ప్లేయర్లు ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. క్వాలిటీ ఎక్కడికీ పోదు. ఒకసారి కోహ్లీ గత రికార్డులు, అతని సెంచరీలు, సగటు చూడండి. మన వ్యక్తిగత జీవితంలోనూ ఎత్తు పల్లాలు ఎదురవుతుంటాయి’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. రోహిత్ అభిప్రాయంతో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఏకీభవించాడు. ఒకటి రెండుసార్లు తక్కువ స్కోర్లకే ఔటైనంత మాత్రాన విరాట్ ఖ్యాతి తగ్గిపోదన్నాడు. కోహ్లీకి మద్దతు ప్రకటించిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. తిరిగి ఫామ్ అందుకునే వరకు అతనికి అందరూ అండగా నిలవాలని అభిప్రాయపడ్డాడు.