T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. న్యూయార్క్ చేరుకున్న భారత క్రికెటర్లు

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. న్యూయార్క్ చేరుకున్న భారత క్రికెటర్లు

ఐపీఎల్ సమరం ముగిసింది. క్రికెట్ ప్రేమికులు ఇక టీ20 వరల్డ్ కప్ కు సిద్ధం కావాల్సిన సమయం వచ్చింది. మరో ఐదు రోజుల్లో (జూన్ 2) పొట్టి ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్లన్నీ అమెరికాలో అడుగుపెట్టనున్నాయి. తాజాగా టీమిండియా న్యూయార్క్ చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘టచ్‌డౌన్‌ న్యూయార్క్‌’ అంటూ బీసీసీఐ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది.

టీ20 ప్రపంచ కప్ 2024 లో తలపడే భారత క్రికెట్ బృదం అమెరికా శనివారం (మే 25) బయలుదేరిన సంగతి తెలిసిందే. ప్రయాణ బృందంలో కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు ప్రధాన క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. 

విరాట్ కోహ్లీ ఆలస్యంగా అమెరికాలో అడుగుపెడతాడని తెలుస్తుంది. అమెరికాకి తాను వెళ్లడం ఆలస్యం అవుతుందని .. ఇందుకు గాను BCCI నుండి అనుమతి పొందినట్లు సమాచారం. దీని ప్రకారం కోహ్లి మే 30వ తేదీ ఉదయం న్యూయార్క్‌కు వెళ్తాడు. కోహ్లీతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అమెరికా ప్రయాణం ఆలస్యం కానుంది. దుబాయ్‌లోని కొన్ని వ్యక్తిగత పనుల కారణంగా బీసీసీఐ నుండి పర్మిషన్ తీసుకున్నాడు. మరోవైపు హార్దిక పాండ్య సైతం లేట్ గా భారత జట్టులో చేరనున్నారు. 

టీ20 ప్రపంచ కప్ పోరుకు అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ టోర్నీ జూన్ 2న ప్రారంభమై జూన్ 29న ముగియనుంది. ఈ మెగా టోర్నీలో భారత క్రికెట్ జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా.. జూన్ 9న దాయాది దేశం పాకిస్థాన్‌‌తో తలపడనుంది. ప్రాక్టీస్‌లో భాగంగా మే 31న భారత్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య ఏకైక వార్మప్ మ్యాచ్ జరగనుంది.