
- సర్వర్.. ఓటీపీ సమస్యలు
- రెండు చోట్ల భూమి ఉంటే కన్పించని వైనం
- కొత్త మండలాల సమస్య
- కార్డులపై స్పష్టత నో
యాదాద్రి, వెలుగు: ఫార్మర్ రిజిస్ట్రీలో రైతు యూనిక్ నెంబర్ ఎంట్రీకి టెక్నికల్ గా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వర్ స్లోగా ఉండడం ఒక సమస్య అయితే.. రైతులకు ఓటీపీలు రావడం లేదు. భూమి రెండు చోట్ల ఉంటే 'అగ్రిస్టాక్'లో కన్పించడం లేదు. దీంతో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రారంభమై నెల గడుస్తున్నా ఉమ్మడి జిల్లాలో 20.5 శాతం ఐడీలు మాత్రమే క్రియేట్అయ్యాయి. ఒకే దేశం.. ఒకే కార్డు దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా వ్యవసాయాన్ని చేర్చిన సంగతి తెలిసిందే.
ప్రతి రైతుకు చెందిన భూముల పూర్తి వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా డిజిటలైజ్ చేస్తోంది. ప్రతి ఒక్కరికీ 12 అంకెలతో కూడిన ఆధార్ నెంబర్ కేటాయించినట్టుగానే ప్రతి రైతుకు 11 అంకెలతో యూనిక్ ఐడీని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేస్తోంది. ఫార్మర్ రిజిస్ట్రీని సెంట్రల్ స్కీమ్కు తప్పనిసరి చేస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిక్ ఐడీ ఉంటేనే కేంద్రం అమలు చేసే కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి స్కీమ్స్ వర్తిస్తాయని స్పష్టం చేసింది.
సర్వర్ స్లో.. ఓటీపీలు సరిగ్గా రావట్టే
ఫార్మర్ రిజిస్ట్రీ కోసం ఎన్ఐసీ 'అగ్రిస్టాక్'ను రూపొందించింది, ఈ యాప్ను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రతి ఏఈవోకు లాగిన్, యూజర్ ఐడీలు అందించింది. ఈ యాప్లోనే ప్రతి రైతు ఆధార్, పట్టాదారు పాస్బుక్, ఫోన్ నెంబర్ను ఏఈవోలు ఎంట్రీ చేస్తున్నారు. సర్వర్ ప్రాబ్లమ్ కారణంగా ఆలస్యమవుతోంది. ప్రతి రైతుకు మూడుసార్లు ఓటీపీ రావాల్సిఉండగా రెండుసార్లు వచ్చి మూడోసారి రావడం లేదు. దీంతో ఒక్కో రైతులకు మూడు నిమిషాల్లో యూనిక్ ఐడీ క్రియేట్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా 10 నుంచి 20 నిమిషాలు పడుతోంది. కొందరికీ మరింత ఆలస్యమవుతోంది.
భూమి రెండు చోట్ల ఉంటే..కన్పిస్తలే
ఒక్కో రైతు ఒకటి కంటే ఎక్కువ చోట్ల వివిధ సర్వే నెంబర్లలో భూములు కలిగి ఉన్నారు. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయగానే ఓటీపీ రావడం, భూమి ఉన్న రైతులకు సంబంధించిన వివరాలు కన్పిస్తున్నాయి. కానీ కొన్నిచోట్ల రెండు అంతకుమించి ప్రదేశాల్లో భూమి కలిగిన రైతుల వివరాలు కన్పించడం లేదు. దీంతోపాటు కొత్త మండలాల సమస్య నెలకొంది. బీఆర్ఎస్ హయాంలో పలు కొత్త మండలాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే.
అయితే వీటి వివరాలు సెంట్రల్ వద్ద సరిగా లేవు. పాత మండలాల పరిధిలోనే ఉన్నాయి. ఒక మండలంలోని గ్రామ వివరాలు, మరో మండలంలో కన్పిస్తున్నాయి. ఉదాహరణకు యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలోని దాచారం, పక్క మండలమైన అడ్డగూడూరులో కన్పిస్తోంది. దీంతో ఆ రైతులకు సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రీ విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయి.
20.5 శాతం ఐడీలు క్రియేట్
ఈ ఏడాది జనవరి వరకు భూ భారతి పోర్టల్లోని వివరాల ప్రకారం యాదాద్రి జిల్లాలో 2,81,086 పట్టదారు పాస్బుక్స్ ఉన్నాయి. నల్గొండలో 5,54,347, సూర్యాపేటలో 3,03,767 ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 11,39,200 పట్టాదారు పాస్బుక్స్ ఉన్నాయి. ఈ పాస్బుక్స్లో 2,33,347 యూనిక్ ఐడీలు క్రియేట్ అయ్యాయి. మొత్తంగా నెల రోజులుగా సాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ ఉమ్మడి జిల్లాలో 20.5 శాతం ఐడీలు మాత్రమే క్రియేట్అయ్యాయి.
కార్డులు ఎలా..?
ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా యూనిక్ ఐడి క్రియేట్ చేస్తున్నా.. కార్డు విషయంలో స్పష్టత లేకుండా పోయింది. కార్డు ఎప్పుడు ఇస్తారు. పోస్టు ద్వారా వస్తుందా అంటూ రైతులు వేస్తున్న ప్రశ్నకు ఏఈఓలు సమాధానం చెప్పలేక పోతున్నారు. ఇప్పటి వరకు తాము ఐడీ మాత్రమే క్రియేట్ చేస్తున్నామని అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. రానున్న రోజుల్లో మీ సేవా సెంటర్లకు లాగిన్ ఇవ్వడానికి డిపార్టుమెంటు ఆలోచన చేస్తున్నదని, అదే జరిగితే కార్డులు మీ సేవ నుంచి ఇస్తారని చెప్పారు.
పట్టాదారు పాస్బుక్స్ సంఖ్య, యూనిక్ ఐడీ పొందిన రైతుల సంఖ్య
జిల్లా పట్టదారు పాస్బుక్స్ ఐడీ పొందిన రైతులు శాతం
యాదాద్రి 2,81,086 70,827 25.6
సూర్యాపేట 3,03,767 62,293 20.6
నల్గొండ 5,54,347 1,00,223 18.1