
- భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ
మంచిర్యాల, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి ఆర్వోఆర్ యాక్ట్ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. మంగళవారం నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించాలని ఆర్డర్స్జారీ అయిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చేసింది. మండలాల వారిగా రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ను సైతం ప్రకటించి ఏ రోజున ఏ గ్రామంలో సదస్సు జరుగుతుందనేది ప్రజలకు తెలిసేలా ప్రచారం చేస్తున్నారు. మండలానికి రెండు టీమ్లను ఏర్పాటు చేసి భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకుంటామని కలెక్టర్ కుమార్దీపక్తెలిపారు. ఈ నెల 20 వరకు సదస్సులు కొనసాగనున్నాయి.
భీమారం మండలంలో 2,148 అప్లికేషన్లు
పైలట్ ప్రాజెక్టు కింద భీమారం మండలంలో మే 5 నుంచి 16 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. 12 గ్రామపంచాయతీల్లో 28 మంది సిబ్బందితో నాలుగు టీమ్లను నియమించి దరఖాస్తులు స్వీకరించారు. ఒక స్పెషల్ సర్వే టీమ్తో రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల నడుమ నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు. మండలంలో 2,148 దరఖాస్తులు రాగా.. అందులో 1,010 సాదాబైనామాలకు సంబంధించినవే. కోర్టులో కేసులు కొనసాగుతున్నందున తీర్పు వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని చెప్తున్నారు. మిగిలిన 1,138లో 741 అప్లికేషన్ల వెరిఫికేషన్ పూర్తయింది. వీటిలో 158 దరఖాస్తులు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నట్టు సమాచారం. మిగిలిన వాటిని ఈ నెల 5 లోగా పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.
సాదాబైనామాలు, అసైన్డ్ భూములపై ఆశలు
భూ భారతి చట్టం ద్వారా ధరణిలో పరిష్కారం కాని సాదా బైనామా, మిస్సింగ్ సర్వే నంబర్, రైతు వివరాలల్లో తప్పులు, డిజిటల్ సిగ్నిచర్ పెండింగ్, అసైన్డ్ టు పట్టా క్లాసిఫికేషన్, ప్రోహిబిటెడ్ జాబితా మార్పు, సక్సెషన్, పెండింగ్ మ్యుటేషన్, భూసేకరణ సమస్యలు, ఫారెస్ట్, ఇరిగేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ల మధ్య డిస్ప్యూట్ఉన్న భూముల మార్పు, తదితర అంశాల కోసం భూ భారతి ఆర్వోఆర్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్న సాదాబైనామాలకు పరిష్కారంతో పాటు అసైన్డ్ భూములకు పట్టాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.