ఏకపక్షంగా మీటింగ్​ పెడ్తరా .. జీఆర్ఎంబీ మీటింగ్​ మినిట్స్​పై తెలంగాణ అభ్యంతరం

ఏకపక్షంగా మీటింగ్​ పెడ్తరా .. జీఆర్ఎంబీ మీటింగ్​ మినిట్స్​పై తెలంగాణ అభ్యంతరం
  • సభ్య రాష్ట్రాలకు సమాచారం ఇవ్వకుండా ఎట్ల నిర్వహిస్తరు?
  • బోర్డుకు ఈఎన్సీ జనరల్​ లేఖ
  • చైర్మన్​ అనుమతి తీసుకునే బోర్డుకు ప్రజెంటేషన్​ ఇచ్చాం
  • బోర్డు మెంబర్​ సెక్రటరీపై ఉద్యోగులు ఆరోపణలు చేసినా దానిపై చర్చే లేదు
  • బోర్డు కేడర్​ స్ట్రెంత్​పై రివ్యూ చేస్తే మాకు తీవ్రమైన ఆర్థిక భారమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్​ డ్రాఫ్ట్​ మినిట్స్​లో పేర్కొన్న అంశాలు వాస్తవదూరంగా ఉన్నాయని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డుకు సంబంధించి వివరాలపై ప్రజెంటేషన్​ ఇస్తామని చైర్మన్​ అనుమతి తీసుకున్నామని, పర్మిషన్​ ఇచ్చాకే ప్రజెంటేషన్​ ఇచ్చామని స్పష్టం చేసింది. కానీ, మీటింగ్​ మినిట్స్​లో మాత్రం చైర్మన్​ మాట్లాడుతున్నప్పుడు అనుమతి లేకుండా తెలంగాణ జోక్యం చేసుకుని వాళ్ల సొంత ఎజెండాను ప్రజెంట్​​ చేశారని పేర్కొన్నదని, ఇలా మినిట్స్​లో పేర్కొనడం అర్థరహితమని తేల్చి చెప్పింది.

 ఈ మేరకు మీటింగ్​ మినిట్స్​పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ  బోర్డుకు ఈఎన్సీ జనరల్ లేఖ రాశారు. ప్రజెంటేషన్​లో తెలంగాణ తెలియజేసిన అంశాలను మినిట్స్​లో కనీసం పేర్కొనలేదని అన్నారు. అసలు సభ్య రాష్ట్రాలకు కనీస సమాచారం ఇవ్వకుండా.. వారి అభిప్రాయాలు తీసుకోకుండా సమావేశం తేదీలను ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించారు. బోర్డు మీటింగ్స్​ తేదీలను పదే పదే మార్చకుండా సమావేశం తేదీలపై మెంబర్​ స్టేట్స్​ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేశారు.

 బోర్డు, కేంద్ర జలశక్తి శాఖ మధ్య జరిగిన ఏ మీటింగ్​అయినా సభ్య రాష్ట్రాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ ఏడాది జనవరి 6న కేంద్ర జలశక్తి శాఖకు (బనకచర్ల ప్రాజెక్టుపై) ఏపీ సీఎం ఇచ్చిన 24 పేజీల కాన్సెప్ట్​ సహా అన్ని వివరాలనూ ఇవ్వాల్సిందిగా ఇరిగేషన్​ ముఖ్య కార్యదర్శి పట్టుబట్టారని, ఆ విషయాలనూ బోర్డు మినిట్స్​లో చేర్చాలని ఆయన స్పష్టం చేశారు. 

మాకు ఆర్థిక భారం

గోదావరి బోర్డుకు శాంక్షన్​ చేసిన పోస్టులపై రివ్యూ చేసేందుకు కమిటీకి రిఫర్​ చేయాలని నిర్ణయించారని, కానీ, ఔట్​సోర్సింగ్​ ద్వారా తీసుకున్న ఉద్యోగుల జీతభత్యాలను కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కాకుండా రాష్ట్రాల రూల్స్​ ప్రకారమే చెల్లించేందుకు డిమాండ్​ చేస్తున్నామని ఈఎన్సీ తెలిపారు. ఈ విషయాన్ని మినిట్స్​లో చేర్చాలని  స్పష్టం చేశారు. బోర్డులో అదనంగా సీఈ, డైరెక్టర్​, డిప్యూటీ డైరెక్టర్​, అసిస్టెంట్​ డైరెక్టర్​ పోస్టుల ను క్రియేట్​ చేయాలని చెబుతున్నా.. దాని వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం మరింత పెరుగు తుందని, దాంతోపాటు వాహనాలు, సిబ్బంది వంటి అంశాల్లోనూ ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు.

 ఈ విషయాన్ని కమిటీకి రిఫర్​ చేసే అంశాన్ని మినిట్స్​ నుంచి తొలగించా లని సూచించారు. కేవలం పెద్దవాగు ప్రాజెక్టు కు సంబంధించిన సీడ్​మనీనే ఇస్తామని, ఆ ప్రాజెక్టును అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నా మని మాత్రమే చెప్పామని తెలిపారు. వర్కింగ్​ మాన్యువల్​పై తయారు చేసిన డ్రాఫ్ట్​ను ఫైనలై జ్​ చేయలేదని, కానీ, ఫైనలైజ్​ చేశారంటూ మినిట్స్​లో చెప్పారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

 మాన్యువల్​పై అభిప్రాయాలు చెప్పేం దుకు 2 రాష్ట్రాలూ ఒప్పుకున్నాయని మినిట్స్​లో పేర్కొన్నారని, కానీ, మాన్యువల్​పై ముందు కెళ్లడానికి ముందు మీటింగ్​ను నిర్వహించి కమిటీకి తమ స్టేట్​మెంట్స్​ సబ్​మిట్​ చేయాల ని కోరామని గుర్తు చేశారు. కానీ, మాన్యువల్​ కమిటీకి చైర్మన్​గా ఉన్న మెంబర్​ సెక్రటరీ.. మీటింగ్​ నిర్వహించాక ఫైనలైజ్​ చేయాలని తాము చెబుతున్నా ఏకపక్షంగా బోర్డు మీటింగ్​లో దీనిని ఎజెండాగా పెట్టారని ఆరోపించారు. కాబట్టి ఈ విషయాన్ని మినిట్స్​ నుంచి తొలగించాలని ఈఎన్సీ  లేఖలో పేర్కొన్నారు.

మాకు చెప్పరా?

వీఐపీ రిఫరెన్స్​ కింద ఓ రాష్ట్రం ఏదైనా అంశాన్ని బోర్డు దృష్టికి తీసుకొచ్చినప్పుడు.. ఆ విషయాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కౌంటర్​ స్టేట్​కు బోర్డు చెప్పాల్సిన అవసరం ఉంటుందని ఈఎన్సీ తన లేఖలో పేర్కొన్నారు. ఏ విషయమైనా బోర్డు దృష్టికి వచ్చినప్పుడు కచ్చితంగా సభ్య రాష్ట్రాలకు ఆ సమాచారాన్ని బోర్డు మెంబర్​ సెక్రటరీ ఇవ్వాల్సి ఉంటుందని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. జీఆర్ఎంబీ మెంబర్​ సెక్రటరీపై తెలంగాణ ఉద్యోగుల ఆరోపణలపై కనీసం చర్చించలేదని, ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. అయితే మెంబర్​ స్టేట్స్​, కేఆర్ఎంబీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ వేసి ఒక్క నెలలో రిపోర్టు ఇవ్వాలని సూచించారన్నారు. 

ఈ విషయం కూడా బోర్డు మీటింగ్​ మినిట్స్​లో మెన్షన్​ చేయలేదని పేర్కొన్నారు. స్టాఫ్​ డిప్యూటేషన్​కు సంబంధించి రిక్రూట్​మెంట్​ రూల్స్​లో మార్పులు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని గుర్తు చేశారు. విభజనచట్టం ప్రకారం ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లోని స్టాఫ్​ను 2 రాష్ట్రాలకు పంచారని, దీంతో రెండు రాష్ట్రాల్లోనూ సిబ్బంది కొరత ఉన్నదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బోర్డుకు అవసరమైన సూటబుల్​ అధికారినే డిప్యూట్​ చేసేందుకు వెసులుబాటు కల్పించారని గుర్తు చేశారు.