
- కొత్త మంత్రులకు కేటాయించే పోర్ట్ ఫోలియోలపై కసరత్తు
- కొందరు పాత మంత్రుల శాఖల మార్పుపై ఊహాగానాలు
- కేబినెట్ బెర్త్లు రాక నారాజైనవాళ్లకు త్వరలో పదవులు!
- ఖాళీ అయిన విప్, కీలక కార్పొరేషన్ పోస్టులు ఇచ్చే చాన్స్
- మిగిలిన మూడు మంత్రి పదవుల భర్తీపైనా ఫోకస్
- అన్నీ కొలిక్కి వస్తే వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలకు..
హైదరాబాద్, వెలుగు: కేబినెట్లోకి కొత్తగా తీసుకున్న ముగ్గురు మంత్రులకు కేటాయించబోయే శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ముమ్మరం చేశారు. ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరికి ఏయే శాఖలు కేటాయించాలో ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ప్రస్తుతం ఇతర మంత్రులకు కేటాయించగా మిగిలిన ఎడ్యుకేషన్, హోమ్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, స్పోర్ట్స్ తో పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు సీఎం వద్దే ఉన్నాయి.
కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న ముగ్గురికి సీఎం వద్ద ఉన్న ఈ శాఖల్లోంచే కేటాయిస్తారనే చర్చ ఆదివారం సాయంత్రం వరకు జరిగింది. కానీ, సోమవారం ఢిల్లీలో మారిన పరిణామాలతో పాత మంత్రులకు చెందిన పలు శాఖల్లోనూ మార్పుచేర్పులు ఉంటాయని ప్రచారం జరుగుతున్నది. కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ భేటీ సుమారు గంటపాటు జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. తన వద్ద ఉన్న శాఖలు, వాటి ప్రాధాన్యతలు, ప్రస్తుత పరిస్థితుల్లో తన దగ్గర ఉంచుకోవాల్సిన శాఖలు, అందుకు కారణాలు, అవిపోగా మంత్రులకు ఇవ్వనున్న శాఖల గురించి కేసీ వేణుగోపాల్కు సీఎం చెప్పినట్లు తెలిసింది.
దీంతో పాటు కేబినెట్ లో ముగ్గురు సీనియర్ మంత్రులకు ఉన్న కీలక శాఖల మార్పుచేర్పులపైనా వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆయా శాఖల పరిధిలో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్నాయని, వారు చేస్తున్న ఆరోపణలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని కేసీ వేణుగోపాల్కు సీఎం రేవంత్రెడ్డి వివరించినట్లు తెలిసింది. దీన్ని బట్టి కొందరు పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉండొచ్చని, దానిపై క్లారిటీ వచ్చాకే కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరగుతున్నది. అందువల్లే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ఆలస్యమవుతుందని అంటున్నాయి.
పదవులపైనా చర్చ..
మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఓ నలుగురు సీనియర్లు అసంతృప్తికి గురైన విషయాన్ని కేసీ వేణుగోపాల్ దృష్టికి సీఎం రేవంత్రెడ్డి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇందులో ఓ ఇద్దరికి గతంలోనే మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చామని, మరో ఇద్దరు కూడా వీటిపై ఆశలు పెట్టుకున్నారని ఆయన వివరించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వేణుగోపాల్ దృష్టికి తీసుకువచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నందున ఈలోపే మిగిలిన మూడు మంత్రి పదవులను భర్తీ చేస్తే బాగుంటుందని చెప్పినట్లు సమాచారం. దీంతో పాటు సామాజిక సమీకరణాల వల్ల మంత్రి పదవులు రాని ముఖ్యమైన ఎమ్మెల్యేలకు చీఫ్ విప్, విప్ పదవులతో పాటు ఆర్టీసీ, సివిల్ సప్లయ్లాంటి కీలక కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమిస్తే బాగుంటుందని చెప్పినట్లు తెలిసింది. ఇతర నామినేటెడ్ పదవులపైనా చర్చించినట్లు సమాచారం. ఈ నెలలోపే ఈ నియామకాలన్నీ పూర్తి చేసుకుంటే జులైలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లొచ్చని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ అన్నట్లు తెలిసింది.