ఉద్యోగార్థులకు ప్రత్యేకం.. అంతర్​ రాష్ట్ర సంబంధాలు

ఉద్యోగార్థులకు ప్రత్యేకం..  అంతర్​ రాష్ట్ర సంబంధాలు

పోటీ పరీక్షల్లో పాలిటీ పేపర్​లో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, అంతర్​ రాష్ట్ర సంబంధాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జల వివాదాలపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునళ్లు, అంతర్ రాష్ట్ర మండళ్లు, ప్రాంతీయ మండళ్లు, జోనల్​ కౌన్సిళ్ల ఏర్పాటుపై ప్రశ్నలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని ఎప్పుడు ఏర్పాటు చేశారు. చైర్​ పర్సన్​గా ఎవరు వ్యవహరిస్తారు. ఇందుకోసం చేసిన చట్టాలు, జోనల్​ కౌన్సిళ్లు ఏర్పాటు, రాజ్యంగబద్ద సంస్థలు, చట్టబద్ద సంస్థలు ఏవి అనే స్పష్టతతో చదవడం వల్ల ఎక్కువ మార్కులు సాధించవచ్చు. 

కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో సఖ్యతను పెంపొందించడానికి అంటే అధికారాల విభజన స్పష్టంగా ఉండటం కోసం అంతర్రాష్ట్ర సంబంధాలు కీలకమైనవి. రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ–17 నీటి గురించి చర్చిస్తుంది. (నీటి సరఫరా, నీటిపారుదల, డ్రైనేజీ) కేంద్ర జాబితాలోని ఎంట్రీ – 56 ప్రజా అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అంతర్​ రాష్ట్ర నదులు, నదీలోయల నియంత్రణ, అభివృద్ధిని చేపట్టవచ్చు. ఆర్టికల్​ 262 జల వివాదాలకు సంబంధించింది. 

ఆర్టిలక్​ 262(1) ఏదైనా అంతర్​ రాష్ట్ర నది లేదా నదీలోయకు సంబంధించిన జాలాల ఉపయోగం, పంపిణీ, నియంత్రణకు సంబంధించిన వివాద పరిష్కారానికి పార్లమెంట్​ చట్టం చేస్తుంది. దీనిలో భాగంగా 1956లో అంతర్​రాష్ట్ర నదీ జలాల వివాద చట్టాన్ని చేసింది. అలాగే 1956లో రివర్​ వాటర్​ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి బోర్డులను ఏర్పాటు చేయదలిచింది. కాని ఇప్పటివరకు ఇలాంటి బోర్డులు ఏర్పాటు కాలేదు. ఆర్టికల్​ 262(2) ప్రకారం పైన చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు లేదా ఇతర కోర్టులు న్యాయసమీక్ష చేయరాదు. 

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు– 2019: ఇది 1956 చట్టానికి సవరణ. అంతర్రాష్ట్ర నదీ జలాలు, నదీ లోయల వివాదాల సత్వర పరిష్కారం దీని ఉద్దేశం. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ వివాద పరిష్కారం కోసం ట్రిబ్యునల్​ను ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరవచ్చు. 

వివాద పరిష్కార కమిటీ: ఏదైనా ఒక రాష్ట్రం జల వివాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్​ చేస్తే కేంద్ర ప్రభుత్వం వివాదాల పరిష్కార కమిటీని ఏర్పాటు చేసి స్నేహపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది. వివాద పరిష్కార కమిటీలో చైర్ పర్సన్​, సభ్యులు (కనీసం 15 సంవత్సరాలు సంబంధిత రంగంలో నిష్ణాతులు), వివాదాస్పద రాష్ట్రాల నుంచి ఒక జాయింట్​ సెక్రటరీ స్థాయి సభ్యుడు ఉంటారు. చైర్​ పర్సన్​, సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించగా, రాష్ట్రాల నుంచి నామినేట్​ చేయబడే సభ్యుడిని సంబంధిత రాష్ట్రమే నామినేట్​ చేస్తుంది. ఏడాది కాలంలో ( ఆరు నెలలు పొడిగించే అవకాశం)  పరిష్కరిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. 

అంతర్రాష్ట్ర నదీజల వివాదాల ట్రిబ్యునల్​: గతంలో ఉన్న ప్రత్యేక ట్రిబ్యునల్స్​ అని రద్దు చేసి, బహుళ బెంచ్​లను ఏర్పాటవుతుంది. చైర్​ పర్సన్​, వైస్​ చైర్​ పర్సన్​తోపాటు ముగ్గురు న్యాయ సభ్యులు, ముగ్గురు ఎక్స్​పర్ట్​ సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. మూడేండ్లలో నిర్ణయం తెలపాలి. అయితే మరో రెండు సంవత్సరాలు పొడిటించవచ్చు. దీని నిర్ణయం సుప్రీంకోర్టు ఆర్డ్​ర్​కు సమానం. 

అంతర్రాష్ట్ర మండళ్లు 

కేంద్ర, రాష్ట్రల మధ్య వివిధ రాష్ట్రాలకు మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు అంతర్​రాష్ట్ర మ్ండలి ఉండాలని ఆర్టికల్ 263 పేర్కొంటుంది. ఆర్.ఎస్​.సర్కారియా కమిషన్​ 1988 జనవరిలో ఇచ్చిన నివేదిక ప్రకారం శాశ్వత ప్రాతిపదికన ఇంటర్ గవర్నమెంటల్​ కౌన్సిల్​ను ఆర్టికల్​ 263 కింద ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. దీని ఆధారంగా 1990 మే 28న వి.పి.సింగ్​ నేషనల్​ ఫ్రంట్​ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది. అంటే ఇది శాశ్వత రాజ్యాంగబద్ద సంస్థ కాదు. ఈ మండలికి చైర్మన్​ ప్రధాన మంత్రి కాగా, అన్ని రాష్ట్రల ముఖ్యమంత్రులు, శాసనసభలు గల కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండాలి. 

కేంద్ర హోంమంత్రితో సహా ప్రధాని నామినేట్​ చేస్తే  ఆరుగురు కేబినెట్​ మంత్రులు, ప్రధాని నామినేట్​ చేసే శాశ్వత ఆహ్వానితులు ( కేంద్ర మంత్రులు) ఉంటారు. అంతర్​రాష్ట్ర మండలిలో మొదటిసారిగా 1990 డిసెంబర్​ 27న సభ్యులను నియమించడమైంది. కాగా తాజాగా 2019లో నూతన సభ్యుల కూర్పు జరిగింది. ఆరుగురు కేంద్ర మంత్రులు. రాజ్​నాథ్​సింగ్​, అమిత్​షా, నిర్మలా సీతారామన్​, నరేంద్రసింగ్​ తోమర్​, తావర్​చంద్ గెహ్లాట్​, హరిదీప్​ సింగ్​పురి. ప్రస్తుతం శాశ్వత ఆహ్వానితులుగా 10 మంది కేంద్ర మంత్రులు అంతర్​ రాష్ట్ర మండలిలో ఉన్నారు. 

విధులు: రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను పరిశీలించి సలహాలు ఇవ్వడం.
వివిధ రాష్ట్రాలకు, కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను పరిశీలించి, చర్చించి నివేదిక ఇవ్వడం.
మండలి చైర్మన్​ అంటే ప్రధాన మంత్రి సూచించిన రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే అంశాల పరిశీలన. 

మండలి స్థాయీ సంఘం: చైర్మన్​ కేంద్ర హోంమంత్రిమండలి సచివాలయం: దీనికి అధ్యక్షులుగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదా గలవారు వ్యవహరిస్తారు. 
దీనిని 1991లో న్యూఢిల్లీలో (విజ్ఞాన్​ భవన్​) ఏర్పాటు చేశారు. 2011 నుంచి జోనల్​ మండళ్లకు కూడా సచివాలయంగా వ్యవహరిస్తుంది. 
పార్లమెంట్​ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర మండలులు
1. భారత వైద్య కేంద్ర మండలి
2. కేంద్ర హోమియోపతి మండలి 
ఆర్టికల్​ 263 కింద రాష్ట్రపతి ఏర్పాటు చేసే అంతర్​రాష్ట్ర మండళ్లు. 
1. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మండలి
2. అమ్మకం పన్ను కోసం ఏర్పాటు చేయబడిన ప్రాంతీయ మండళ్లు
3. స్థానిక ప్రభుత్వ, పట్టణాభివృద్ధి కేంద్ర మండలి

ప్రాంతీయ మండళ్లు

ప్రాంతీయ మండళ్ల గురించి 1956లో రాష్ట్రాల పునర్​ వ్యవస్థీకరణ కమిషన్​ (ఎస్​ఆర్సీ)పై డిబేట్​లో భాగంగా మొదటి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూ ప్రస్తావించారు. నెహ్రూ దేశంలో సలహాపూర్వకమైన మండళ్లు నాలుగు లేదా ఐదు ఉండాలని సూచించాడు. దీనిలో భాగంగానే రాష్ట్రాల పునర్వ్యవస్తీకరణ చట్టం–1956లోని పార్ట్​–3 కింద దేశంలో ఐదు జోనల్​ కౌన్సిళ్లు ఏర్పాటైనవి. అంటే ఇవి చట్టబద్దమైన సంస్థలు. జోనల్​ కౌన్సిళ్లకు చైర్మన్ గా కేంద్ర హోంమత్రి ఉంటారు. ప్రతి జోన్​ కింద ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు రొటేషన్​ పద్ధతిలో ఒక సంవత్సర కాల వ్యవధిలో వైస్​ చైర్మన్​గా పనిచేస్తారు. ముఖ్యమంత్రి, గవర్నర్​ నామినేట్​ చేయబడే ఇద్దరు మంత్రులు, ఆ జోన్​లో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇద్దరు సభ్యులుగా ఉంటారు.  

ఏర్పాటుకు కారణాలు

  • ప్రాంతీయతత్వం, భాషాతత్వం వంటి అభివృద్ధి నిరోధక అంశాలను అదుపుచేయడానికి 
  • కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం కోసం
  • అభివృద్ధికారక ప్రాజెక్టుల వేగవంతమైన అమలు కోసం

విధులు

  • జోన్​లోని రాష్ట్రాల ఆర్థిక, సామాజిక ప్రణాళిక రూపకల్పన
  • సరిహద్దు వివాదాలు, భాషాపరమైన మైనారిటీలు లేదా రాష్ట్రాల మధ్య రవాణాపరమైన అంశాలకు సంబంధించి సిఫారసు చేయడం
  • రాష్ట్రల పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఏదైనా రాష్ట్ర ఏర్పాటు విషయం 
  • ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్​ప్రదేశ్, మణిపూర్​, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్​ రాష్ట్రాలను జోనల్​ కౌన్సిల్​లో చేర్చలేదు. వీటి ప్రత్యేక సమస్యలను చూడటానికి ఈశాన్య రాష్ట్రాల మండలి చట్టం 1972 కింద శాన్య రాష్ట్రాల మండలి ఏర్పాటైంది. అయితే ఈశాన్య రాష్ట్రాల మండలి సవరణ చట్టం – 2012 ప్రకారం ఈ మండలిలోకి ఎనిమిదో రాష్ట్రంగా సిక్కింను నోటిఫై చేయడమైంది. తర్వాత హోంమంత్రిత్వ శాఖ సిక్కింను ఈ మండలి నుంచి తొలగించి తూర్పు కౌన్సిల్​లో చేర్చింది.

వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్​​