- 3 హైడల్ ప్రాజెక్టులు, 2 బ్యారేజీలు అక్రమంగా నిర్మిస్తున్నరు
- అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండానే పనులు
హైదరాబాద్ : ఏపీ అక్రమ ప్రాజెక్టులను ఆపివేయించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్కు, కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు మంగళవారం వేర్వేరు లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డుల అనుమతి లేకుండానే ఏపీ ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. నేషనల్ వాటర్ పాలసీ ప్రకారం అత్యంత కరువు ప్రాంతాలకు తాగునీళ్లు అందించేందుకు కృష్ణా నదీ జలాలను మళ్లిస్తామని చెప్తున్న ఏపీ సర్కారు.. వాటిపైనే అక్రమంగా హైడల్ పవర్ ప్లాంట్లను నిర్మిస్తోందని వివరించారు. ఇప్పటికే గోరకల్లు రిజర్వాయర్ ఆధారంగా పిన్నాపురం స్టోరేజ్ పంపింగ్ స్టేషన్ పనులను చేపట్టిందని, తాజాగా కడప జిల్లాలోని గండికోటపై వెయ్యి మెగావాట్లు, అనంతపురం జిల్లాలోని చిత్రావతిపై 500 మెగావాట్ల స్టోరేజీ ప్రాజెక్టులను నిర్మిస్తోందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం అదానీ గ్రీన్ ఎనర్జీతో కలిసి రూ.60 వేల కోట్ల విలువైన 3,700 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు నిర్మాణానికి అగ్రిమెంట్ చేసుకుందని తెలిపారు. సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్, కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు తీసుకునే వరకు ఎలాంటి పనులు చేపట్టకుండా కట్టడి చేయాలని తెలంగాణ అధికారులు కోరారు.
రివర్ బోర్డు జోక్యం చేస్కోవాలె..
ప్రకాశం బ్యారేజీకి దిగువన 12 కిలోమీటర్ల వద్ద పెనుమలూరు మండలం చోడవరం, మంగళగిరి మండలం రామచంద్రాపురం వద్ద రూ.1,215 కోట్లతో, 62 కిలోమీటర్ల వద్ద మోపిదేవి మండలం బండికొళ్లంక, రేపల్లె మండలం తూర్పుపాలెం వద్ద రూ.1,350 కోట్లతో బ్యారేజీల నిర్మాణానికి ఏపీ వాటర్ రీసోర్సెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డీపీఆర్లు రూపొందించిందని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం సముద్రం పోటును నిలువరించే పేరుతో ఈ బ్యారేజీల నిర్మాణానికి ప్రయత్నిస్తోందని 2020 అక్టోబర్లోనే బోర్డుకు ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కొత్తగా ఏ ప్రాజెక్టు నిర్మించాలన్న దానికి అపెక్స్ కౌన్సిల్, సంబంధిత రివర్ బోర్డు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. బోర్డు వెంటనే జోక్యం చేసుకొని ఈ బ్యారేజీల పనులు ఆపివేయించాలని కోరారు.