హైదరాబాద్, వెలుగు : కేఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్లో ఏపీలోని ప్రాజెక్టులకు కల్పించిన రక్షణను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఆయా ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేకున్నా వాటి ఆపరేషన్కు అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఈమేరకు కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. 2021 జులై 15న జారీ చేసిన కేఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్కు అనుబంధంగా 2022 జూలై 17న మరో నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. ఈ గెజిట్లో ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్లోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టుల ఆపరేషన్కు రక్షణ కల్పించారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని కోరుతూ బ్రజేశ్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ –2) ముందు వాదనలు వినిపిస్తున్నామని లేఖలో తెలిపారు.
పాలమూరు – రంగారెడ్డి, డిండి లిఫ్ట్స్కీమ్లు, ఎస్ఎల్బీసీ టన్నెట్ప్రాజెక్టు అనుమతులు ఇవ్వాలని తాము కోరుతున్నామని, ఇన్బేసిన్లోని తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వకుండా బేసిన్ అవతలికి నీటిని తరలించే ఏపీ ప్రాజెక్టులకు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. కృష్ణాలో 75 శాతం డిపెండబులిటీ వద్ద తెలంగాణ ప్రాజెక్టులకు న్యాయ పరమైన కేటాయింపులు చేయాలని కోరుతున్నామని తెలిపారు. గెజిట్లో మినహాయింపు ఇచ్చిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవని, అలాంటప్పుడు ఆపరేషన్మినహాయింపు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఏ ప్రాజెక్టుకు అయినా నీటిని కేటాయించే అధికారం ట్రిబ్యునల్కే ఉంటుందని, అలాంటప్పుడు మినహాయింపు ఎలా ఇస్తారని నిలదీశారు. ఏపీ రీ ఆర్గనైజేషన్యాక్ట్లోని సెక్షన్–11లో పేర్కొన్న జాబితా అసమగ్రంగా ఉందని తెలిపారు. 2002 నుంచే పాక్షికంగా ఆపరేషన్లో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఆ జాబితాలో చేర్చలేదన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రాజెక్టులకు రక్షణను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.